కొత్త మంత్రులతో ప్రధాని మోడీ ఎమన్నారో తెలుసా?
న్యూఢిల్లీ: 'మీకు అవసరం ఉన్నప్పుడు దయచేసి ఎలాంటి మొహమాటం లేకుండా నన్ను సంప్రదించండి' ప్రమాణ స్వీకారనంతరం 19 మంది మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్న మాటలివి. కేబినెట్ మంత్రులు ఉండగా సహాయ మంత్రులు ప్రధాని మోడీని కలవలేకపోతున్నారని ఇటీవల మధ్య కాలంలో గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
''కేంద్ర మంత్రివర్గంలోకి చేరినందుకు సంబరాలు జరుపుకోవడానికి మీకు కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. తరువాత పనిలోకి దిగాల్సిందే..'' ప్రధాని మోడీ తన కొత్త సహచరులతో అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మోడీ కొత్త మంత్రులతో మాట్లాడారు.
అంకితభావంతో, కష్టించి పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. దేశాభివృద్ధికి అంకితం కావాలంటూ వారిని ప్రోత్సహించారు. సుమార 30 నిముషాల పాటు సాగిన ఈ సమావేశంలో అవసరం వచ్చినప్పుడు ఎలాంటి మొహమాటం, అడ్డు లేకుండా సంప్రదించవొచ్చని ఆయన చెప్పారు.
ముందుగా కొత్త మంత్రులకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ కొత్తవారికి పలు సూచనలు చేశారు. ఎటువంటి సమయంలోనైనా అవసరం వచ్చినప్పుడు తనను కలవాలని, అలా కలవడం కూడా చాలా ముఖ్యమని వారికి తెలిపారు. సహాయమంత్రుల బాధ్యతే ప్రభుత్వపాలనలో ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
కొత్తగా చేపట్టిన వారు బాధ్యతలకు అవసరమైన సమాయత్తతను త్వరగా అలవర్చుకోవాలని మోడీ సూచించారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన విధులకు తగినట్లుగా, తన పాత్రను పోషించేందుకు నాలుగు నెలల్లో అన్ని సమకూర్చుకున్నానని వారికి తెలియజేశారు.
మంత్రి పదవి వచ్చిన తరువాత అభిమానులు, అనుచరులంతా సన్మానాలు చేయడానికి తెగ ఆరాటపడతారని, వాటన్నింటికీ దూరంగా ఉండాలని ప్రధాని వారికి సూచించినట్లు తెలిసింది. ఆగస్టు 15వరకు సంబురాలు, సన్మానాలకు దూరంగా ఉండి శాఖాపరమైన పనులపై దృష్టి సారించాలని, పార్లమెంటు సమావేశాలకు సిద్దం కావాలని మోడీ సూచించారు.
కొత్త మంత్రుల పనితీరుపై రెండు, మూడు నెలల తర్వాత సమీక్షిస్తామని వెల్లడించినట్లు సమాచారం. తాను గురువారం విదేశీ పర్యటనకు బయలుదేరే నాటికి కొత్త మంత్రులు తమ శాఖల్లో కుదురుకోవాలని ప్రధాని ఆదేశించినట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధాని క్లాస్ తీసుకోవడంపై కొందరు మంత్రులు బిక్క మోహం వేసినట్లు సమాచారం.
కాగా, మంత్రివర్గ మార్పులపై మాట్లాడిన ప్రధాని, ఇది పునర్వ్యవస్థీకరణ కాదని స్పషం చేశారు. మరోవైపు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు బీజేపీ అధ్యక్షడు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.