ఫ్లాష్ బ్యాక్: 1965 భారత్ పాక్ యుద్ధంలో పట్టుబడ్డ కేసీ కరియప్ప... ఎలా విడుదలయ్యారు..?
భారత్ పాకిస్తాన్ల మధ్య 1965లో యుద్ధం జరిగింది. ఆసమయంలో పాక్ దళాలను భారత్ ధీటుగా ఎదుర్కొంటోంది. భారత్ నుంచి కేసీ కరియప్ప సరిహద్దులో యుద్ధవిమానంతో గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పాక్ దాడి చేయడంతో యుద్ధవిమానం కుప్పకూలింది.ఆ విమానంకు పైలట్గా వ్యవహరించిన 36 ఏళ్ల కేసీ కరియప్ప అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.ప్రాణాలతో అయితే బయటపడ్డాడు కానీ యుద్ధ ఖైదీగా దాయాది దేశం పాక్కు పట్టుబడ్డాడు... మరి ఆనాడు తను ఎలా తిరిగి భారత్కు వచ్చాడు..? ఆ విషయాలపై కరియప్ప ఏం చెప్పాడు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ పైలట్ కేసీ కరియప్ప
అది 1965వ సంవత్సరం. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న రోజులు. ఇక యుద్ధం చివరి రోజున భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. విధుల్లో భాగంగా గగనతలంలో గస్తీ నిర్వహిస్తున్న ఓ యుద్ధవిమానంను పాక్ దళాలు కూల్చేశాయి. దానికి పైలట్గా వ్యవహరించిన కేసీ కరియప్ప ప్రాణాలతో బయటపడ్డాడు కానీ పాక్ సైన్యానికి చిక్కాడు. ఇక యుద్ధఖైదీలుగా దొరికిన వారు ఏమైతే వివరాలు చెప్పాలని ముందుగా సూచిస్తారో అలానే అందరిలానే తన పేరు, ర్యాంకు, యూనిట్ నెంబరు చెప్పాడు. ఈ విషయాన్ని వెంటనే రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు చేరవేయడం జరిగింది.

కేసీ కరియప్ప తండ్రి కేఎం కరియప్ప
చీకటి గదిలో బంధీగా ఉన్న కరియప్ప దగ్గరకు సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు చేరుకున్నారు. తన పేరు కరియప్ప అని చెప్పగానే వారికి అనుమానం వచ్చి ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కుమారుడివా అని ప్రశ్నించారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత త్రివిధ దళాలకు అధిపతిగా కేఎం కరియప్ప వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన్ను ఆర్మీ ఛీఫ్గా భారత ప్రభుత్వం నియమించింది. ఇక సీన్ కట్ చేస్తే పట్టుబడ్డ కేసీ కరియప్ప తన తండ్రి కేఎం కరియప్ప అని వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కేసీ కరియప్పకు తెలియదు. తనను పాకిస్తాన్ అరెస్టు చేసిందన్న విషయం కూడా తన కుటుంబానికి తెలియదని నాటి జ్ఞాపకాలను వివరించారు కేసీ కరియప్ప.

కేసీ కరియప్ప విడుదల ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన తండ్రి
అయితే బయట మాత్రం చాలా ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నట్లు కేసీ కరియప్ప చెప్పారు. నాటి పాక్ జనరల్ ఆయుబ్ ఖాన్ పాకిస్తాన్ రేడియోలో ఓ ప్రకటన చేశారు. కేసీ కరియప్పను పాక్ ఆర్మీ యుద్ధఖైధీగా పట్టుకుందనే ప్రకటన చేశారు. అయితే కస్టడీలో ఆయన సురక్షితంగా ఉన్నారంటూ కూడా వివరించారు. కేసీ కరియప్పా ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కుమారుడైనందున వెంటనే విడుదల కూడా చేస్తామని ఆఫర్ ఇచ్చారు. 1947లో దేశ విభజన జరగకముందు పాక్ మేజర్ జనరల్ ఆయుబ్ ఖాన్కు బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో బాస్గా వ్యవహరించారు ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్పా. కేఎం కరియప్ప పై ఉన్న గౌరవంతోనే అతని కుమారుడు కేసీ కరియప్పను విడుదల చేసేందుకు ఆఫర్ ఇచ్చారు ఆయుబ్ ఖాన్. ఆయుబ్ ఖాన్ ఇచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన కేఎం కరియప్పా.... యుద్ధ ఖైదీలుగా ఉన్న భారతీయ జవాన్లు అందరూ తన కొడుకుతో సమానమే అని వారందరూ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు కేసీ కరియప్ప చెప్పారు.

నాకొడుకుతో పాటే ఇతర జవాన్లు కూడా
"నా తండ్రి విలువలు పాటించేవ్యక్తి. ఆయనకు తన కొడుకైన ఇతరుల జవాన్లైనా అందరూ సమానమే.ఆయుబ్ ఖాన్ నా తండ్రికి జూనియర్ అయి ఉండి చాలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తి అయినప్పటికీ నా విడుదలకు అంగీకరించలేదు. ఆ తర్వాత అందరితో పాటే నేను కూడా విడుదలయ్యాను" అని కేసీ కరియప్ప తెలిపారు. పాక్ బంధీ నుంచి విడుదలై భారత్లోని తన ఇంటికి చేరుకునే వరకు యుద్ధం ముగిసిందని తను చివరిరోజున పట్టుబడ్డ విషయం తనకు తెలియదని కేసీ కరియప్ప చెప్పారు. ఆ తర్వాత భారతవాయుసేనకు చెందిన హెలికాఫ్టర్ యూనిట్లో కరియప్ప విధుల్లో చేరారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా కేసీ కరియప్పా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications