గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరకని చోట.. 20 సెకెన్ల పాటు చేతులు కడుక్కోవడం సాధ్యమేనా?
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని తన గుప్పిట్లో బంధించిన కరోనా వైరస్.. ఓ సరికొత్త పాఠాన్ని నేర్పుతోంది. మనిషి ప్రాణానికి మించిన విలువైనదేదీ లేదనే ప్రాథమిక సూత్రాన్ని అందరి మెదళ్లలోనూ ఎక్కిస్తోంది. ప్రాణమే లేనప్పుడు పొదుపు పాటించడం వల్ల ఫలితం ఉండదనే నీతిని బోధిస్తోంది. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ల కోసం పానీపట్టు యుద్ధాలకు దిగాల్సిన దుస్థితిని ఎదుర్కొనే ప్రాంతాల్లో 20 సెకెన్ల పాటు ఏకధాటిగా చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలనే ప్రశ్న తలెత్తేలా చేసింది.

నీటి పొదుపు గురించి..
సాధారణంగా వేసవి కాలం సమీపించిందంటే.. నీటి పొదుపు గురించి హితబోధ చేస్తుంటారు. నీటిని వ్యర్థం చేయకూడదని, ప్రతి నీటి చుక్కనూ సంరక్షించుకోవాలని సూచిస్తుంటారు. తాము కాపాడుకునే ప్రతి నీరు కూడా వేరొకరి దాహాన్ని తీరుస్తుందని చెబుతుంటారు. జల సంరక్షణ గురించి ఉపన్యాసాలను దంచేస్తుంటారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు, వర్షభావం వంటి పరిస్థితులు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాలను చేపడుతుంటారు.

దీనికి భిన్నంగా తాజా పరిస్థితులు..
ఈ వేసవి సీజన్లో దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. జల సంరక్షణ గురించి ఎవరూ నోరెత్తట్లేదు. నీటి పొదుపు గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ప్రస్తుతం అందరి నోటి నుంచీ వినిపిస్తోన్న ఒకే ఒక్క మాట.. చేతులను శుభ్రంగా కడుక్కోవడం. కనీసం 20 సెకెన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, ఎన్నిసార్లు కడుక్కుంటే అంత మంచిదని చెబుతున్నారు. దీనికి కారణం మనకు తెలియనిదేమీ కాదు. కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి చేతులను శుభ్రంగా కడుక్కోవాలనేది వాటి సారాంశం.

ప్రాణం మీదికి వచ్చినప్పుడు పొదుపు గురించి
కరోనా వైరస్ విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ప్రాణం మీదికి వస్తుందనే సందేశాన్ని ఇస్తున్నారు. అక్కడి దాగా బాగానే ఉన్నప్పటికీ.. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచినీళ్లు లభించని ప్రాంతాల్లో ఇక 20 సెకెన్ల పాటు చేతులను ఎలా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. నడివేసవిలో నీటి చుక్క కనిపించని ప్రాంతాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పలు చోట్ల కనిపిస్తూనే ఉంటాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఒక వ్యక్తి 20 సెకెన్ల పాటు తన చేతులను శుభ్రం చేసుకోవడానికి కనీసం ఒక లీటర్ నీటిని వినియోగించుకుంటారట. ఒక వ్యక్తి సగటున తన రోజువారీ అవసరాల కోసం 20 లీటర్ల నీటిని వాడుతుంటారని డబ్ల్యూహెచ్ఓ నివేదికలు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భ, రాజస్థాన్, ఒడిశా, బిహార్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో చుక్కనీరు దొరకని ప్రదేశాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటాయి. అలాంటి చోట్ల శుభ్రత ఎలా? అనే ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు.

ట్యాంకర్ల వద్ద పానిపట్టు యుద్ధాలు..
నడి వేసవిలో తమ వీధిలోకి ఓ ట్యాంకర్ వచ్చిందంటే.. నీళ్ల కోసం ఎన్ని రకాలుగా యుద్ధాలు చేయాల్సి వస్తుందో మనకు తెలియనిది కాదు. బిందెలతో పానిపట్టు యుద్ధాలను చేస్తుంటారు మహిళలు. ఓ బిందెడు నీళ్లు దొరికితే గొంతు తడుపుకోవచ్చనే ఉద్దేశం వారిది. అలాంటి చోట 20 సెకెన్ల పాటు చేతులను ఎలా శుభ్రం చేసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానాన్ని ఇచ్చే వారే ఈ వేసవిలో కనిపించకుండా పోయారనే అంటున్నారు.

నీటి ట్యాంకర్ వద్ద సోషల్ డిస్టెన్సింగ్ సాధ్యమా?
నీటి ట్యాంకర్ వద్ద మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ మరీ నీటిని పట్టుకుంటూంటారు. అలాంటి చోట సోషల్ డిస్టెన్సింగ్ ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రత్యేకంగా ట్యాంకర్లను పంపించే వ్యవస్థ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో శుభ్రతను ఎలా పాటించగలుగుతారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. చాలినంత నీటిని, అదనపు ట్యాంకర్లను పంపించే వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడే చేతుల శుభ్రత సాధ్యమని అంటున్నారు.












Click it and Unblock the Notifications