ఎల్ నినో ఇంపాక్ట్- కన్వెక్టివ్ క్లౌండ్స్: ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా మరో విడత..!!
దేశంలో నైరుతి రుతుపవనాలi ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సీజన్ ముగిసేలోపు దేశంలోని పలు ప్రాంతాల్లో చివరివిడతగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నెల 12 నుంచి 21 తేదీ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడటానికి అనుకూల వాతావరణం నెలకొని ఉన్నట్లు తెలిపింది. ప్రత్యేకించి.. దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య భారత్ లో ఈ వర్షాలు కురిసే పడొచ్చు. లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోన్న ప్రాంతాలకు ఇది కొంత ఉపశమనం కలిగించనుంది.
సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగే ఈ నైరుతి రుతుపవనాల సీజన్లో ఈ సారి ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకున్న బలమైన ఎల్ నినో పరిస్థితుల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా రుతుపవనాల కదలికలు గణనీయంగా మందగించాయి. దీనివల్ల ప్రస్తుత సీజన్లో సాధారణం కంటే దాదాపు 14 శాతం మేర వర్షపాత లోటు నమోదైంది. రానున్న రోజుల్లో కూడా తక్కువ వర్షపాతమే నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ చివరి విడత వర్షాలు రైతాంగానికి కీలకం కానున్నాయి. ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడకపోవడం, పొడి వాతావరణం వల్ల పంటల సాగు తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు కురిసే ఈ తాజా వర్షాల వల్ల నేలలో తేమ శాతం పెరిగి, చేతికి అందే దశల్లో ఉన్న పంటలకు అవసరమైన నీరు అందుతుందని, వర్షాభావ పరిస్థితుల వల్ల ఆందోళన చెందుతున్న రైతులకు ఇది కొంతవరకు ఊరటనిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఇన్శాట్-3డీఎస్ నుంచి అందిన తాజా చిత్రాలను ఐఎండీ విశ్లేషించింది. దీని ప్రకారం.. వాయువ్య ప్రాంతాల్లో మేఘాల సాంద్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దక్షిణ, తూర్పు ప్రాంత పరిధిలో మాత్రం కన్వెక్టివ్ క్లౌడ్స్ కదలికలు ఇంకా చాలా బలంగా కేంద్రీకృతమై కనిపించాయి. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో అకస్మాత్తుగా బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ తాత్కాలిక వాతావరణ మార్పుల వల్ల బలహీనపడిన రుతుపవన వ్యవస్థ మళ్లీ కొద్దిరోజుల పాటు పుంజుకోనుంది.
ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే ఈ తుది వర్షాల కాలం ముగిసిన వెంటనే రుతుపవనాలు దేశం నుంచి తిరుగుముఖం పట్టనున్నాయి. సాధారణంగా వాయువ్య నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ సారి సెప్టెంబర్ చివరి వారంలో ఈ తిరోగమన ప్రక్రియ మరింత వేగవంతం కావచ్చని ఐఎండీ పేర్కొంది. వాయువ్య ప్రాంతం నుంచి ప్రారంభమై ఇది క్రమంగా దేశంలోని మధ్య, తూర్పు, దక్షిణ ప్రాంతాలకు విస్తరిస్తూ దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తుంది.
మొత్తంమీద, ఈ రాబోయే తుది వర్షాల వల్ల దేశంలో నెలకొన్న వర్షపాత లోటు పూర్తిగా భర్తీ కాకపోయినా ప్రస్తుత పంట కాలానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రుతుపవన వ్యవస్థ బలహీనపడుతున్న తరుణంలో కురిసే ఈ చివరి జల్లుల వల్ల భూగర్భ జలాలు కూడా కొంత మెరుగుపడే అవకాశాలు లేకపోలేదు.














Click it and Unblock the Notifications
