హోటల్లో అగ్నిప్రమాదం: ఇద్దరు పర్యాటకుల మృతి, ముగ్గురికి గాయాలు
సిలిగురి: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో మూడవ అంతస్తులోని ఓ గదిలో ఉన్న ఇద్దరు పర్యాటకులు మంటల్లో చిక్కుకుకొని ప్రాణాలు కోల్పోయారని పోలీసులు బుధవారం తెలిపారు. వారు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.
మృతులు కోల్కతా నుంచి భూటాన్ పర్యటనకు వెళుతూ సిలిగురిలోని ఈ హోటల్లో బస చేశారని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.
రెండు గంటలపాటు శ్రమించిన అగ్నిమాపక దళాలు మంటలను పూర్తిగా అర్పేశాయి. హోటల్లోని ఇతర పర్యాటకులను సమీపంలోని హోటళ్లకు తరలించారు. అగ్ని ప్రమాద నివారణకు కావాల్సిన ఏర్పాట్లు చేయని కారణంగా హోటల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హోటల్ యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు.