పాక్ కాల్పులు: మృత సైనికుడు హైదరాబాద్వాడే
జమ్ము5 : కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది. పూంచ్ జిల్లా బాలాకోట్ సబ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత పోస్టులపై పాక్ కాల్పులు జరపడంతో ఒక జవాను చనిపోయాడు. అయితే భారత సైనికులు వెంటనే తిప్పికొట్టారు.
మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమైన ఈ కాల్పులు సుమారు 7 గంటలపాటు కొనసాగాయి. కేవలం 24 గంటల వ్యవధిలో ఇలా పాక్ కాలుదువ్వడం ఇది రెండోసారి. వారం వ్యవధిలో ఎనిమిదోసారి. పాకిస్తాన్ కాల్పుల్లో మరణించిన సైనికుడు లాన్స్ నాయక్ మహ్మద్ ఫిరోజ్ ఖాన్ హైరాబాద్కు చెందినవాడు.

మెంథార్లోని హమీర్పూర్ ప్రాంతంలో పాకిస్తాన్ దళాలు ప్రయోగించిన మోర్టార్ స్ప్లింటర్ తగిలి ఫిరోజ్ ఖాన్ మరణించినట్లు తెలుస్తోంది. ఫిరోజ్ ఖాన్ మృతి పట్ల వైట్ నైట్ కోర్ కమాండర్ తీవ్ర సంతాపం తెలిపారు.
కాగా, పూంచ్ జిల్లాలోని సాజియన్ ప్రాంతంలో మందుపాతరపై కాలు వేయడంతో అది పేలిన సంఘటనలో ఒక జవాన్ కాలు కోల్పోయాడు. మంగళవారం ఉదయం హరిమ్పూర్, భింబర్ గాలి సబ్సెక్టార్లలో పాక్ మోర్టార్ల దాడిని భారత సైనికులు తిప్పికొట్టారు.












Click it and Unblock the Notifications