పార్లమెంట్ బడ్జెట్ వేడి: పెగాసస్పై ఫోకస్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఎకనమిక్ సర్వే నివేదికను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. మంగళవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించడం ఇది 10వ సారి.
బడ్జెట్ సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇవ్వాళ ఆరంభం కానున్నవి తొలిదశ సమావేశాలు. ఫిబ్రవరి 11వ తేదీన ముగుస్తాయి. మళ్లీ మార్చి 14వ తేదీన లోక్సభ, రాజ్యసభ మలి విడతలో భేటీ అవుతాయి. రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు భేటీ అవుతాయి. వివిధ మంత్రిత్వ శాఖ, విభాగాల నుంచి అందిన డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ మీద స్టాండింగ్ కమిటీలు కసరత్తు చేస్తాయి.
తొలి విడతలో 29, మలి విడతలో 19 సార్లు లోక్సభ, రాజ్యసభ సమావేశమౌతాయి. ఫిబ్రవరి 2,3,4,7 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలుపుతుంది సభ. పూర్తి కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా లోక్సభ, రాజ్యసభ వేర్వేరుగా భేటీ అవుతాయి. అదే సమయంలో రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకుని సోమ, మంగళవారాల్లో రాజ్యసభ, లోక్సభల్లో జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండబోవని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 2వ తేదీ బుధవారం నుంచి ఈ రెండు సెషన్లను పునరుద్ధరిస్తామని సెక్రెటేరియట్ పేర్కొంది. తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించదలిచిన సభ్యులకు ఆన్లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించింది. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇ-పోర్టల్ ద్వారా గానీ లేదా పార్లమెంటరీ నోటీస్ ఆఫీస్లో వ్యక్తిగతంగా గానీ- తాము ప్రస్తావించదలిచిన అంశాల గురించిన సమాచారాన్ని తెలియజేయవచ్చని సూచించింది.
పార్లమెంట్ రూల్స్, ప్రొసీజర్ల ప్రకారం.. సమావేశాలను నిర్వహించిన ప్రతీసారీ.. ప్రతీరోజు జీరో అవర్, క్వశ్చన్ అవర్ కోసం 60 నిమిషాలను కేటాయించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు లోక్సభలో తొలుత క్వశ్చన్ అవర్ మొదలవుతుంది. ఆ తరువాత జీరో అవర్ను షెడ్యూల్ చేస్తుంది సెక్రెటేరియట్. ఇది పార్లమెంట్ ఆనవాయితీ. రాజ్యసభలో తొలుత జీరో అవర్ ఆరంభమౌతుంది. దాని తరువాత క్వశ్చన్ అవర్ను నిర్వహిస్తారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలి రోజు నుంచే టీఆర్ఎస్.. మోడీ సర్కార్పై యుద్ధాన్ని ప్రకటించినట్టయింది. అటు కాంగ్రెస్ కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. పెగాసస్ స్పైవేర్ను మరోసారి తెర మీదికి తీసుకుని రానుంది. ఈ స్పైవేర్ను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెండు బిలియన్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసిందంటూ మీడియాలో కథనాలు స్పష్టం చేసిన నేపథ్యంలో- దీన్ని ప్రధాన అజెండాగా తీసుకుంది.