గుజరాత్ తీరంలో పాక్ ఉగ్రవాదుల పడవ: పేల్చేసుకున్నారు
అహ్మదాబాద్: పాకిస్తాన్కు చెందిన ఓ పడవ భారతదేశంలోని గుజరాత్ తీరంలో పేలిపోయింది. ఈ ఫిషింగ్ బోట్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంట పాటు పోరుబందర్ తీరంలో కోస్ట్ గార్డులు ఆ పడవను గర్తించి, దాన్ని వెంటాడారు. ఆ పడవలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
26/11లో పది మంది ఉగ్రవాదులతో పాకిస్తానీ పడవ ఒక్కటి ముంబైకి తీరానికి చేరిన అనుభవం ఉంది. ఆ పది మంది ఉగ్రవాదులు జతలుగా విడిపోయి ముంబై నగరంలోకి చొరబడ్డారు. ఆ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 166 మంది మరణించారు.
ప్రస్తుతం గుజరాత్ తీరం ద్వారా పడవలో వచ్చి భారతదేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించడానికి ప్రయత్నించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయిజనవరి 1వ తేదీ తెల్లవారు జామున ఆ పడవ అరేబియా సముద్రంలో గుజరాత్ తీరానికి చేరుకున్నట్లు చెబుతున్నారు. పడవలో పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
కోస్ట్ గార్డులు వెంటపడడంతో పడవలోని నలుగురు వ్యక్తులు కూడా తమను తాము పేల్చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కోస్ట్ గార్డులు హెచ్చరికులు చేస్తూ కాల్పులు కూడా జరిపారు. పాకిస్తాన్ కరాచీ సమీపంలోని కేతి బుందర్ నుంచి ఆ పడవ బయలుదేరినట్లు సమాచారం. పోరుబందరుకు 365 కిలోమీటర్ల దూరంలో ఉండగా కోస్ట్ గార్డులు ఆ పడవను గుర్తించారని సమాచారం.
పడవను ఆపడానికి కోస్ట్ గార్డులు ప్రయత్నించడంతో దాని వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది. వేగం పెంచి పారిపోవడానికి ప్రయత్నించారని అంటున్నారు. ఎట్టకేలకు దాన్ని ఆపడంతో పడవలోని వారు తమను తాము పేల్చేసుకున్నారని చెబుతున్నారు. ఆ పడవ అక్కడికక్కడే సముద్రంలో మునిగిపోయింది. ఇంకా అన్వేషణ సాగుతోంది.