గణనీయంగా పెరిగిన మహిళల నిష్పత్తి - దేశంలో తొలి సారిగా : జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి..!!
దేశంలో తొలిసారిగా మహిళా నిష్ఫత్తి పురుషుల కంటే ఎక్కువగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 2వ దశ నివేదిక ప్రకారం దేశంలో స్త్రీ,పురుషుల నిష్పత్తి గణనీయమైన స్థాయిలో మెరుగుపడింది. ప్రతి వెయ్యి మంది పురుషులకు, మహిళల నిష్పత్తి 1,020కి చేరింది. అయితే, చిన్నారులు, మహిళలను రక్తహీనత సమస్య వేధిస్తూనే ఉంది. ఈ బాధితుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. బాల్య వివాహాలు తగ్గాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే వారి సంఖ్య పెరిగింది.
707 జిల్లాల్లో చేసిన సర్వే ఆధారంగా
కేంద్ర ప్రభుత్వం గత డిసెంబరులో తెలుగు రాష్ట్రాలతో సహా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డేటా విడుదల చేయగా, ఇదివరకు మిగిలిపోయిన 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డేటాను కలిపి పూర్తిస్థాయి నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 707 జిల్లాల్లో 6.1 లక్షల మంది నుంచి సేకరించిన వివరాలతో రూపొందిన ఈ నివేదికను నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్లు విడుదల చేశారు. తాజాగా జత చేసిన 14 రాష్ట్రాల సమాచారంతో కలిపి ఇప్పుడు జాతీయ పరిస్థితులను ఎన్ఎఫ్హెచ్ఎస్-4తో పోల్చారు.
1000 : 1020 కి చేరిన తాజా నిష్ఫత్తులు
జాతీయ కుటుంబ సర్వే-4 ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుషులకు మహిళలు (లింగ నిష్పత్తి) 991 ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 29మేర పెరిగింది. ప్రస్తుతం ఇది పట్టణ ప్రాంతాల్లో 985కే పరిమితం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 1,037కి చేరింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో జరిగే కాన్పులు 78.9% నుంచి 88.6%కి చేరాయని సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. సిజేరియన్ కాన్పులు 17.2% నుంచి 21.5%కి చేరాయి. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే (17.6%), పట్టణ ప్రాంతాల్లో (32.3%) అత్యధికంగా ఉంది. సిజేరియన్ కాన్పుల్లో 47.4% ప్రైవేటు, 14.3% ప్రభుత్వ ఆసుపత్రుల్లో చోటుచేసుకున్నాయి.
దేశంలోనే తొలి సారిగా
పుదుచ్చేరిలో 100%, తమిళనాడులో 90%కిపైగా ఆసుపత్రుల్లో కాన్పులు జరుగుతున్నాయి. గత సర్వేతో పోలిస్తే ఇప్పటికి మహిళల సంతాన సాఫల్య నిష్పత్తి 2.2 నుంచి 2కి తగ్గింది. కాగా, కుటుంబ నియంత్రణ 54% నుంచి 67%కి చేరింది. బాల్య (మహిళలకు 18 ఏళ్లలోపు) వివాహాలు 2015-16లో 26.8శాతంగా ఉండగా 2019-21కి 23.3 శాతానికి తగ్గుముఖం పట్టాయి. చిన్నారుల్లో పౌష్టికాహార లోప సమస్య కొంతమేర తగ్గింది. వయసుకు తగిన ఎత్తు పెరగకపోవడమనే సమస్య 38% నుంచి 36%కి, వయసుకు తగిన బరువు లేకపోవడమనే సమస్య 36% నుంచి 32%కి తగ్గిపోయింది.
ఆందోళన కరంగా రక్త హీనత
చిన్నారుల్లో రక్తహీనత సమస్య మాత్రం ఆందోళనకరంగానే ఉంది. 6-59 నెలల మధ్య వయసున్న చిన్నారుల్లో ఈ సమస్య 58.6% నుంచి 67.1%కి, 15-49ఏళ్ల వయసున్న సాధారణ మహిళల్లో 53.2% నుంచి 57.2%కి, గర్భిణీల్లో 50.4% నుంచి 52.2%కి పెరిగింది. మొత్తంగా చూస్తే 15-49 ఏళ్ల వయసున్న మహిళల్లో 59.1%మంది, పురుషుల్లో 31.1% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గతంలో ఇది 54.1%, 29.2%కే పరిమితమైంది. కుటుంబ నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం 84% నుంచి 88.7%కి చేరింది. పట్టణ మహిళల భాగస్వామ్యం 91%, గ్రామాల్లో 87.7%మేర ఉంది.
Recommended Video
మెరుగైన మహిళల ఆర్దిక స్థితి గతులు
సొంత భూమి, ఇళ్లు ఉన్న మహిళల సంఖ్య 38.4% నుంచి 43.%కి చేరింది. ఈ విషయంలో పట్టణ ప్రాంత (38.3%) మహిళల కంటే గ్రామీణ మహిళలే (45.7%) మెరుగైన స్థితిలో ఉన్నారు. బ్యాంకు ఖాతాలు నిర్వహించే మహిళల సంఖ్య ఈ రెండు సర్వేల మధ్యకాలంలో 53% నుంచి 79%కి చేరింది. మొబైల్ ఫోన్లున్న మహిళల సంఖ్య 45.9% నుంచి 54%కి చేరింది. దేశంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు కొంతమేర మెరుగుపడ్డాయి. విద్యుత్తు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యం మెరుగుపడింది.