మారనున్న భారత రాజకీయ ముఖచిత్రం: అయోధ్య తీర్పును కొనియాడిన విదేశీ మీడియా
అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మోడీ విజయంగా అభివర్ణించింది విదేశీ మీడియా. అయోధ్య తీర్పుతో భారత రాజకీయ సామాజిక రూపురేఖలు మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. తీర్పు తర్వాత దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో భారత ప్రభుత్వం విజయం సాధించిందని అమెరికా మీడియా కొనియాడింది.
అయోధ్య తీర్పును కొనియాడిన విదేశీ మీడియా
అయోధ్య రామమందిరం నిర్మాణంకు గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అడ్డంకులను తొలగిస్తూ వివాదాస్పద భూమి ఆలయంకే చెందుతుందనే తీర్పు ఇచ్చి, అన్ని అడ్డంకులకు చెక్ పెట్టింది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఇక రామమందిరం నిర్మాణంకు లైన్ క్లియర్ అయ్యింది. అదే సమయంలో మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే మరో ఐదెకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయోధ్య తీర్పుపై అమెరికా ప్రధాన మీడియా రిపోర్టింగ్ చేసింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునివ్వడాన్ని ప్రశంసించింది.
భారత ప్రభుత్వంపై విదేశీ మీడియా ప్రశంసలు
ఇక తీర్పు తర్వాత ఇరువర్గాల మధ్య ఎలాంటి గొడవలకు తావు లేకుండా భారత ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యలను అమెరికా మీడియా కొనియాడింది. భారత హోంశాఖ దేశవ్యాప్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ గట్టి భద్రతా చర్యలను తీసుకుందని పారామిలటరీ దళాలను మోహరించిందని చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు పౌరులు పెట్టకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడాన్ని ప్రశంసించింది అమెరికా మీడియా. ఎటు చూసినా ఖాకీలే కనిపించాయని కథనాలను ప్రసారం చేసింది.
బీజేపీ అజెండా అదే: విదేశీ మీడియా
అయోధ్యపై హిందువుల వాదనతో కోర్టు అంగీకరించిందని న్యూయార్క్టైమ్స్ రాసుకొచ్చింది. అంతేకాదు మోడీకి ఇది అద్భుతమైన విజయమని చెప్పిన న్యూయార్క్ టెమ్స్ భారత్ను మరింత అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు మోడీకి ఇదొక మంచి అవకాశమని పేర్కొంది. దేశంలో అత్యంత వివాదాస్పద స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసిందని వాషింగ్టన్ పోస్టు కథనం రాసుకొచ్చింది. అంతేకాదు భారత్ ప్రాథమికంగా హిందూదేశం అని పేర్కొన్న వాషింగ్టన్ పోస్టు దేశవ్యవస్థాపకులు చెబుతున్నట్లుగా లౌకిక గణతంత్ర రాజ్యం కాదనే కీలక వ్యాఖ్యలు చేసింది. మే నెలలో మోడీ అఖండ విజయం సాధించారని ఇప్పుడు అదే అజెండాను మోడీ సర్కార్ అమలు చేస్తోందని సంచలన కామెంట్స్ తన పత్రికలో ప్రచురించింది.
మోడీ సర్కార్ గెలుపుగా అభివర్ణించిన గార్డియన్
ప్రధాని మోడీ విజయం సాధించిన ఆరునెలల్లోనే సుప్రీంకోర్టు దశాబ్దాలుగా వివాదాస్పదంగా మారిన అయోధ్య కేసులో తీర్పు ఇవ్వడం మోడీ సర్కార్ గెలుపుగా మరో ప్రముఖ పత్రిక ది గార్డియన్ రాసుకొచ్చింది. హిందూ అజెండాలో భాగంగా అయోధ్యలో ఆలయ నిర్మాణం చేపట్టాలనేది బీజేపీ ప్రధాన అంశం అని గార్డియన్ రాసుకొచ్చింది. ఇక తీర్పు రాగానే కోర్టు ఆవరణలో జైశ్రీరాం అనే నినాదాలు వినిపించాయని బీబీసీ రాసుకొచ్చింది. విశ్వాసం, హింస, మసీదులో రాముడి విగ్రహం పెట్టడం లాంటి సున్నితమైన అంశాలతో కూడిన కేసుపై సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పును ఇచ్చిందని బీబీసీ రాసుకొచ్చింది.