ఎమ్మెల్యేలకు మతిపోయింది, అందుకే శశికళను: మాజీ మంత్రి
చెన్నై: అన్నాడీఎంకే శాసన సభ్యులకు మతిపోయిందని, అందుకే శాసనసభాపక్ష నేతగా వీకే. శశికళను ఎన్నుకున్నారని ఆపార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేపీ. మునిసామి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శశికళ మీద విరుచుకుపడ్డారు.
అన్నాడీఎంకే పార్టీ గుర్తుతో, జయలలిత చరిష్మాతో తమిళనాడులో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అయితే అలా ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వారికి ఇష్టం లేకపోయినా ప్రజలను వ్యతిరేకిస్తూ శశికళను ముఖ్యమంత్రిని చెయ్యడానికి సిద్దం అయ్యారని ఆరోపించారు.
శశికళ నాయకత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి కేపీ. మునిసామి అన్నారు. అలాంటిది ప్రజలను అభిప్రాయాన్ని కాదని శశికళను సీఎం చేస్తున్న ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలుస్తారా ? అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థులను గెలిపించే సత్తా శశికళకు ఉందా ? అని ఆయన ప్రశ్నించారు.
జయలలిత నమ్మిన ఎమ్మెల్యేలు ఇప్పుడు అమ్మ అభిప్రాయాలకు భిన్నంగా శశికళను సీఎం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి నాయకులను ప్రజలు క్షమించరని చెప్పారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదని, సరైన వ్యక్తిని సీఎం చేసి తమిళనాడును అభివృద్ది చెయ్యడానికి నాయకులు సిద్దం కావాలని మాజీ మంత్రి కేపీ. మునిసామి సూచించారు.