షాకింగ్ : పూజ చేస్తూనే కుప్పకూలిపోయిన మాజీ ఎమ్మెల్యే... ఆలయంలోనే కన్నుమూత..
పుట్టుక-చావు నడుమ బతుకనేది క్షణభంగుర బుద్బుదప్రాయం. ఏ క్షణాన దేహం చలనం కోల్పోతుందో చెప్పడం కష్టం. తాజాగా మధ్యప్రదేశ్లోని బైతూల్లో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన ఓ మాజీ ఎమ్మెల్యే... ఆ క్రతువులో ఉండగానే ప్రాణాలు విడిచారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో... ఉన్నచోటే కుప్పకూలిపోయారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే... బైతూల్కి చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వినోద్ డాగా ప్రతీరోజూ ఉదయం స్థానిక జైన ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈ నెల 12న కూడా జైన ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. అక్కడి పార్శనాథుడి మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసి,పూజ నిర్వహించారు. పూజ చివరలో తలను స్వామి పాదాలపై ఆన్చి.. మనసులోనే ఆయన ఆశీస్సులు కోరారు. అనంతరం అక్కడినుంచి పక్కకు కదిలే లోపే... అకస్మాత్తుగా ఆయన కుప్పకూలిపోయారు.

కాసేపటికి ఆలయ సిబ్బంది ఆయన కిందపడి ఉండటాన్ని గమనించి పైకి లేపే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకీ ఉలుకు పలుకు లేకపోవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు... వినోద్ డాగా మృతి చెందినట్లు నిర్దారించారు. వినోద్ డాగా హఠాన్మరణంతో ఆయన కుటుంబంతో పాటు స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

ఇటీవలి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో వినోద్ డాగాకు కాంగ్రెస్ పార్టీ మెహ్గావ్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. గురువారం(నవంబర్ 12) బైతుల్కి రావడం కంటే ముందు... భోపాల్లో కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. వినోద్ డాగా గతంలో ఎమ్మెల్యేగా,సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశారు.












Click it and Unblock the Notifications