గృహ హింస: ఎఫ్ఐఆర్లో ఆప్ మాజీ మంత్రి పేరు
న్యూఢిల్లీ: అమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి, ఢిల్లీ శాసన సభ్యుడు సోమ్ నాథ్ భారతీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన భార్య లిపికా పట్ల గృహ హింసకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో బుధవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
ఢిల్లీ న్యాయ శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో సోమ్ నాథ్ భారతీ గృహ హింసకు పాల్పడ్డారని ఆయన భార్య లిపికా ఆరోపణలు చేశారు. తరువాత సోమ్ నాథ్ భారతీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో పోలీసులు ఇద్దరిని కుర్చోబెట్టి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఇద్దరి మధ్య రాజీ చెయ్యడానికి పలువురు ప్రయత్నించారు. మధ్యవర్తిత్వం నిర్వహించినా ఫలితం లేదు. చివరికి ఆయన మీద కేసు నమోదు చెయ్యవలసి వచ్చిందని పోలీసు అధికారులు చెప్పారు. లిపికా ఆరోపణలు చేసిన సమయలో సోమ్ నాథ్ భారతీ కోర్టును ఆశ్రయించారు.
తనకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని మనవి చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు కానిదే ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో బెయిల్ తీసుకోవడానికి కోర్టు ను ఆశ్రయించడానికి సోమ్ నాథ్ భారతీ ప్రయత్నాలు మొదలు పెట్టారు.