కట్టుకున్న భార్యే అలా చేస్తే!: ఎట్టకేలకు విముక్తి పొందిన ఫ్రెంచ్ రాయబారి
ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తనకు న్యాయం జరగడంతో కోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
బెంగుళూరు: కూతురిపై లైంగిక వేధింపుల కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తున్న ఫ్రాన్స్ కు చెందిన రాయబారి పాస్కల్(44)కు కేసు నుంచి విముక్తి లభించింది. ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తనకు న్యాయం జరగడంతో కోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
అదే సమయంలో ఏ తప్పూ చేయని తనపై కట్టుకున్న భార్యే కేసు పెట్టడంపై పాస్కల్ ఆవేదన వ్యక్తం చేశాడు.'ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. నా భార్యే అసలైన నేరస్తురాలు' అంటూ వాపోయాడు.
కాగా, 2012లో పాస్కల్ తమ నాలుగేళ్ల కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆయన భార్య సుజా జోన్స్(42) కేసు పెట్టింది. అప్పట్లో ఆయన బెంగుళూరులోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ గా పనిచేసేవాడు. భార్య ఫిర్యాదుతో.. 2012, జూన్ 19న సెక్షన్376(రేప్),377కింద కేసు నమోదు చేసి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై విడుదలయ్యాడు.
జైలు నుంచి విడుదలయ్యాక ఓ గంట సమయం పాటు పిల్లలను కలిసేందుకు కోర్టు అతనికి అనుమతినిచ్చింది. అయితే బాధిత బాలికను కలుసుకునేందుకు మాత్రం కోర్టు అనుమతించలేదు. అదే సమయంలో తండ్రుల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థ తరుపున అతను పోరాడాడు.
మనవళ్లను మనవరాలిని చూసేందుకు వారితో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా, దాంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని మోడీకి ఆర్జీ పెట్టుకున్నాడు. తాజాగా బెంగుళూరు కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశాడు. తన భార్యే నేరస్తురాలని పేర్కొన్నాడు.