మాజీ కేంద్రమంత్రి, దిగ్గజ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత
మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ (97) మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో కన్నుమూశారు.
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ (97) మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో కన్నుమూశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. శాంతి భూషణ్ మొరార్జీ దేశాయ్ క్యాబినెట్లో 1977-1979 మధ్య భారత న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత ఆయన 1980లో ప్రసిద్ధ ఎన్జీవో 'సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్'ని స్థాపించారు. ఇది ప్రారంభం నుంచి అనేక ముఖ్యమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 2018లో శాంతి భూషణ్ 'మాస్టర్ ఆఫ్ రోస్టర్' విధానాన్ని మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టులో స్వాతంత్ర్య సమరయోధుడు రాజ్నారాయణ్ తరపున న్యాయవాది శాంతిభూషణ్ వాదనలు వినిపించారు. అనేక కీలక అంశాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై వాదనలు వినిపించారు. అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపించిన న్యాయవాదిగా ప్రఖ్యాతిగాంచారు శాంతి భూషణ్.

శాంతి భూషణ్ రాజకీయంగా చాలా చురుకుగా ఉండేవారు. మొదట కాంగ్రెస్(ఓ) పార్టీతో అనుబంధం కలిగిన శాంతిభూషణ్.. దేశంలో ఎమర్జెన్సీ అనంతరం ఏర్పాటైన జనతా పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు న్యాయశాఖ మంత్రిగానూ సేవలందించారు. కేంద్ర న్యాయ మంత్రిగా ఉన్న సమయంలో, ఆయన భారత రాజ్యాంగంలోని 44వ సవరణను ప్రవేశపెట్టారు. ఇది ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆమోదించిన 42వ సవరణలోని అనేక నిబంధనలను తిప్పికొట్టింది.
1980లో శాంతి భూషణ్ బీజేపీలో చేరారు. అయితే 1986లో ఎన్నికల పిటిషన్లో పార్టీ ఆయన సలహాకు వ్యతిరేకంగా వెళ్లడంతో రాజీనామా చేశారు.ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్లో 1925 నవంబర్ 11న జన్మించిన శాంతి భూషణ్ ప్రముఖ న్యాయవాదిగా ఎదిగారు. పౌరస్వేచ్ఛకు ఆయనను ఛాంపియన్గా పేర్కొంటారు.కాగా, శాంతి భూషణ్ కుమారుడు ప్రశాంత్ భూషణ్ కూడా సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications