కర్నాటక కొత్త పీసీసీ చీఫ్గా మాజీ మంత్రి డీకే శివకుమార్ నియామకం
బెంగళూరు: కర్నాటక పీసీసీ అధ్యక్షుడిగా దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ను కాంగ్రెస్ అధిష్టానం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీకే శివకుమార్ ఒక్కలిగ సామాజిక వర్గంకు చెందినవారు. ఆర్థికంగా అత్యంత బలమైన వ్యక్తి. 2018లో కర్నాటక ఎన్నికలు ముగియగానే జేడీఎస్తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు కర్నాటక కాంగ్రెస్లో ఆయన ట్రబుల్ షూటర్ అని చెప్పుకుంటారు.
కర్నాటకలోని రామనగర జిల్లా కనకపురా తాలూకా డీకే శివకుమార్ సొంత గ్రామం. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుటుంబంలోని ముగ్గురు సభ్యులపై విజయం సాధించిన ఘనత డీకే శివకుమార్కు ఉంది. ఇందులో దేవెగౌడపై రెండుసార్లు శివకుమార్ విజయం సాధించారు.
హెచ్డీ కుమారస్వామి, అతని భార్య అనిత కుమారస్వామిలపై కూడా పోటీ చేసి విజయం సాధించిన ఘనత శివకుమార్ది. సంతనూర్, కనకపురా నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు. 2019 లోక్సభలో తన సోదరుడు విజయం సాధించడంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఇక కర్నాటక పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందంటూ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. అంతేకాదు కర్నాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా అధిష్టానంనియమిస్తున్నట్లు తెలిపారు.
ఈశ్వర్ ఖాండ్రే, సతీష్ జార్కియోలీ, సలీమ్ అహ్మద్లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులు కాగా... పార్టీ ఆఫీస్ బేరర్స్ చీఫ్ విప్లను కూడా నియమించింది. నారాయణస్వామి, అజయ్ సింగ్లు నియమితులయ్యారు. ఇక ముందుగా ప్రకటించినట్లుగానే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎల్పీ నేతగా కొనసాగుతారని స్పష్టం చేశారు.