ఏడేళ్లల్లో 7 నిమిషాలు కూడా టైమ్ ఇవ్వలేదు: బీజేపీకి మాజీ సీఎం గుడ్బై: కేసీఆర్ నా ఫ్రెండ్..!!
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్.. గుడ్ బై చెప్పారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. తాను రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు. ఎలాంటి పరిస్థితుల్లో తాను బీజేపీలో చేరానో.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల మధ్య తాను పార్టీని వీడుతున్నాననే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
2015లో బీజేపీ జాయిన్..
1999లో గిరిధర్ గమాంగ్ ఒడిశా ముఖ్యమంత్రిగా పని చేశారు. జాతీయ స్థాయి రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. కోరాపుట్ లోక్ సభ నుంచి తొమ్మిదిసార్లు విజయం సాధించడం అంటే మాటలు కాదు. 2015లో ఆయన బీజేపీలో చేరారు. తాను ఎలాంటి షరతులు విధించకుండా స్వచ్ఛందంగా బీజేపీలో చేరానని, తనకు దక్కాల్సిన గౌరవం, మర్యాద లభించలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జేపీ నడ్డాకు పంపించిన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు.
న్యాయం చేయలేకపోతున్నా..
బీజేపీలో ఉంటూ రాష్ట్ర ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోతున్నానని భావిస్తున్నందు వల్లే రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని, దీన్ని తక్షణమే ఆమోదించాలని జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన భువనేశ్వర్ లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
గౌరవం దక్కలేదు..
పార్టీలో తనకు ఏ మాత్రం గౌరవం దక్కలేదని గిరిధర్ గమాంగ్ వాపోయారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా తనకు కనీస సమాచారం ఇవ్వట్లేదని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను చేపట్టినప్పటికీ- తనను ఆహ్వానించట్లేదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయి నాయకులు తన ఇంటి చుట్టే తిరుగుతుంటారు గానీ.. తనను కలవడానికి ఇష్టపడట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడేళ్లల్లో ఏడు నిమిషాలు కూడా..
ఈ ఏడు సంవత్సరాల వ్యవధిలో ఏడు నిమిషాలు కూడా తన కోసం కేటాయించలేదని, దీన్ని తాను అవమానంగా భావిస్తోన్నానని, అందువల్లే రాజీనామా చేశానని వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకొల్పిన భారత్ రాష్ట్ర సమితిలో చేరే విషయంపైనా ఆయన స్పందించారు. తాను కేసీఆర్ ను కలిశానని, తనకు ఆప్తమిత్రుడని కితాబిచ్చారు. తనను, తన కుమారుడిని హైదరాబాద్ కు భోజనానికి ఆహ్వానించారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ లో చేరికపై..
రాజకీయ నాయకులు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడతారని, దీనికి భిన్నంగా కేసీఆర్ తమకు ఎంతో గౌరవం ఇచ్చారని గిరిధర్ గమాంగ్ వ్యాఖ్యానించారు. తాను జాతీయ పార్టీలో మాత్రమే చేరుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తోందని, ఆ అందులో చేరడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.