కేంద్ర మాజీమంత్రి కుమారమంగళం భార్య దారుణ హత్య: వీఐపీ జోన్లో ఘోరం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర మాజీమంత్రి పీ రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టీ కుమారమంగళం దారుణ హత్యకు గురయ్యారు. వీఐపీ జోన్గా పరిగణించే వసంత్ విహార్ ప్రాంతంలో ఘటన సంభవించింది. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు ఆగ్నేయ ఢిల్లీ డీసీపీ తెలిపారు. మరో ఇద్దరి కోసం విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టామని అన్నారు. హత్యకు గల కారణాలను ఇంకా తెలియరావట్లేదని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.
తమిళనాడుకు చెందిన కుమారమంగళం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. కేంద్ర న్యాయ, విద్యుత్ మంత్రిత్వ శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. 2000లో ఆయన మరణించారు. ఆయన భార్య కిట్టీ కుమారమంగళం ఢిల్లీ వసంత్ విహార్లో ఒంటరిగా నివసిస్తోన్నారు. మంగళవారం రాత్రి ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. 9 గంటల సమయంలో ఆమె హత్యకు గురై ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దోపిడీ కోసం వచ్చిన ముగ్గురు దొంగలు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తోన్నారు.

ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నామని, అనుమానితులను అదుపులోకి తీసుకుంటోన్నామని అన్నారు. దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చామని డీసీపీ పేర్కొన్నారు. అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తోన్నామని చెప్పారు. ప్రస్తుతం తమ అదుపులో ఒక నిందితుడు ఉన్నాడని, అతను ఇచ్చిన సమాచారం ప్రకారం.. మిగిలిన వారి కోసం గాలిస్తోన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications