కేఫ్ కాఫీ డే రెస్టారెంట్ల అధిపతి ఆత్మహత్య చేసుకున్నారా? రెండురోజుల కిందటే..ఆ లేఖలో ఏం రాశారు?
బెంగళూరు: కేఫ్ కాఫీ డే. కాఫీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్లు అవి. నగరాల్లో ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరు. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. విదేశాల్లోనూ కేఫ్ కాఫీ డే రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్ ను నమోదు చేస్తోన్న ఈ రెస్టారెంట్ల ఛైర్మన్ వీజీ సిద్ధార్థ అదృశ్యం అయ్యారు. 18 గంటలుగా ఆయన జాడ తెలియరావట్లేదు. సిద్ధార్థ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు. సిద్ధార్థ రాసినట్లుగా భావిస్తోన్న ఓ లేఖ ఆయన కారులో లభించింది. కర్ణాటకలోని మంగళూరు శివార్లలో నేత్రావతి బ్రిడ్జి వద్ద ఆపి ఉంచిన కారు నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ లేఖ సిద్ధార్థే రాసి ఉండి ఉంటే- ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జీవితంపై విరక్తి చెందానని ఈ లేఖలో రాసి ఉంది. సిద్ధార్థ సంతకం చేసి ఉన్న లేఖగా చెబుతున్నారు.
నేత్రావతి బ్రిడ్జిపైనే ఎందుకు?
సిద్ధార్థకు కర్ణాటకలోని చిక్ మగళూరు జిల్లాలో తేయాకు ఎస్టేట్ ఉంది. ఆసియాలోనే అతిపెద్ద తేయాకు తోట అది. దీనిద్వారా వచ్చే టీ, కాఫీలతోనే ఆయన కేఫ్ కాఫీ డే రెస్టారెంట్లను నడిపిస్తున్నారు. సోమవారం సాయంత్రం చిక్ మగళూరు జిల్లాలోని సకలేశ్ పురా నుంచి మంగళూరుకు కారులో బయలు దేరారు. మంగళూరు శివార్లకు చేరుకున్న వెంటనే నేత్రావతి బ్రిడ్జి వద్ద కారును ఆపారు. కారు దిగొద్దని, తాను అయిదు నిమిషాల్లో వెనక్కి వస్తానని డ్రైవర్ తో చెప్పి వెళ్లిపోయారు సిద్ధార్థ. అంతే. ఇక అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఎంత సేపటికీ సిద్ధార్థ తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన డ్రైవర్.. కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని అందజేశారు. నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదే సమయంలో ఆయన కారులో లేఖ లభించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని కలిగిస్తోంది.
Recommended Video
రెండురోజుల కిందటే లేఖ..
వీజీ సిద్దార్థ రాసినట్టుగా అనుమానిస్తోన్న ఈ లేఖ రెండురోజుల కిందటిది. శనివారం నాటి తేదీ దీనిపై రాసి ఉంది. ఇంగ్లీష్ అక్షరాలతో టైప్ చేసి ఉన్న ఈ లెటర్ కింద వీజీ సిద్ధార్థ సంతకం ఉంది. `జీవితంలో నేను విఫలం అయ్యాను. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాను. సంవత్సరాల తరబడి పోరాటం సాగిస్తున్నాను. ఇక పోరు కొనసాగించే శక్తి లేదు. ఓడిపోయాను. ఎంత కష్టపడ్డా వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చలేకపోతున్నాను. అంతకుముందు పనిచేసిన ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్ జనరల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. మైండ్ ట్రీ సంస్థతో కుదుర్చుకున్న డీల్ ను రద్దు చేయడానిక ప్రయత్నాలు సాగాయి. కాఫీ డే రెస్టారెంట్ల షేర్లను అటాచ్ చేయడానికి కొందరు ప్రయత్నించారు. ఇవన్నీనన్ను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. ఇప్పటిదాకా చోటు చేసుకున్న పొరపాట్లకు నేను బాధ్యుడిని. ప్రతి లావాదేవీకీ నాదే బాధ్యత... అంటూ సాగింది ఈ లేఖలో. చివరిలో వీజీ సిద్ధార్థ అనే సంతకం కింద ఈ నెల 27వ తేదీని రాశారు.
గజ ఈత గాళ్లతో గాలింపు..
కాగా- సిద్ధార్థ అదృశ్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నౌకా దళం, తీర ప్రాంత రక్షక బలగాలు రంగంలోకి దిగాయి. నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో నౌకాదళ, తీర ప్రాంత రక్షక బలగాలు అన్వేషణ ఆరంభించాయి. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నేత్రావతి నది ఉరకలు వేస్తోంది. నది ప్రవాహం అంచనాలకు మించి ఉండటం గాలింపు చర్యలకు ఆటంకాన్ని కలిగిస్తోందని అంటున్నారు.
ఎస్ ఎం కృష్ణ ఇంటికి కాంగ్రెస్ నేతల బారులు
ఎస్ ఎం కృష్ణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల అనంతరం ఆయన భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీలో చేరిన తరువాత రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. సిద్ధార్థ అదృశ్యమైన సమాచారాన్ని అందుకున్న వెంటనే కాంగ్రెస్, జనతాదళ్, బీజేపీ నేతలు ఆయన నివాసానికి తరలి వెళ్లారు. కృష్ణను పరామర్శిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ దేవేగౌడ, డికే శివకుమార్ వంటి పలువురు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు పరామర్శించిన వారిలో ఉన్నారు. కాగా- సిద్ధార్థ గాలింపు చర్యలను వేగవంతం చేయాలని కోరుతూ కర్ణాటకకు చెందిన బీజేపీ లోక్ సభ సభ్యులు పలువురు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఈ మేరకు వారు ఓ వినతిపత్రాన్ని అందజేశారు.