బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీలో భారీ వర్షాలు
Bay of Bengal: వరుస అల్పపీడనాలు, తుఫాన్లు వెంటాడుతూనే ఉన్నాయి. దాదాపు రెండునెలల నుంచి ఒకదాని వెంట ఒకటిగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతూనే వస్తోన్నాయి. భారీ వర్షాలతో ముంచెత్తుతున్నాయి. నవంబర్/డిసెంబర్లల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటం సహజమే అయినప్పటికీ- ఇప్పుడు దీని తీవ్రత మరింత పెరిగింది.
మొన్నటివరకు భారీ వర్షాలతో అతలాకుతలమైంది తమిళనాడు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిశాయి. బీభత్సాన్ని సృష్టించాయి. అక్కడి రిజర్వాయర్లు, భారీ, మధ్య, చిన్న తరహా నీటి ప్రాజెక్టులు వరదనీటితో తొణికిసలాడుతున్నాయి. ఈ పరిస్థితికి ఇప్పట్లో బ్రేకులు పడకపోవచ్చు. మరో విడత భారీ వర్షాలు పొంచివున్నాయి.

తాజాగా బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. సోమవారం సాయంత్రతానికి అల్పపీడనంగా మారినట్లు చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది వాయవ్య దిశగా కదులుతుందని, తమిళనాడు తీరం వెంబడి దీని కదలికలు ఉండొచ్చని అంచనా వేసింది.
దీని ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి నుంచి రెండు రోజుల పాటు అంటే- ఈ నెల 19వ తేదీ వరకు చెన్నై సహా తీర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంపై చేపలవేటకు వెళ్లకూడదని సూచించింది.
గురువారం వరకు బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వీటి తీవ్రత గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడానికి అవకాశం ఉంది. కేప్ కొమొరిన్ ఏరియా పరిధిలోకి వచ్చే కన్యాకుమారి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిధిలోని మన్నార్ ఐలండ్, పంబన్ ఐలండ్ల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై ఆర్ఎండీ వెల్లడించింది.
దీని ప్రభావం ఏపీ దక్షిణ ప్రాంతం, రాయలసీమపైనా తీవ్రంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. నేడు నెల్లూరు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దీని తీవ్రత 19వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications