సంక్షోభం నుంచి సంస్కరణల వరకు బడ్జెట్ కథ
భారతదేశంలో బడ్జెట్ (Budget) అంటే కేవలం ఆదాయం -వ్యయాల లెక్కలు కాదు. అది కాలానికి అద్దం, భవిష్యత్తుకు దారి చూపే దిక్సూచి. కొన్ని బడ్జెట్లు ప్రజలకు తక్షణ ఉపశమనాన్ని ఇచ్చాయి. మరికొన్ని మాత్రం కఠిన నిర్ణయాలతో దేశాన్ని మలుపుతిప్పాయి. కానీ భారత ఆర్థిక చరిత్రలో రెండు బడ్జెట్లు మాత్రం ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. ఒకటి సంక్షోభపు చీకట్లో పుట్టిన బడ్జెట్. మరొకటి ఆశలతో దేశాన్ని ముందుకు నడిపించిన బడ్జెట్.
సంక్షోభంలో పుట్టిన Budget - 1973
1970 ప్రారంభం.. భారతదేశానికి అత్యంత కష్టకాలం. 1971 యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ భారం మోపింది. బంగ్లాదేశ్ నుంచి లక్షలాది శరణార్థులు రావడంతో ప్రభుత్వ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు 1972లో వచ్చిన తీవ్ర కరువు... దేశం మొత్తం ఆర్థికంగా అల్లాడిపోయింది. ఈ నేపథ్యంలో 1973లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంతరావు బి. చవాన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత చరిత్రలో 'బ్లాక్ బడ్జెట్'గా నిలిచిపోయింది. కారణం ఏంటంటే..రూ. 550 కోట్ల భారీ లోటు. ఆ రోజుల్లో అది ఊహించని, భయపెట్టే నంబర్. అప్పట్లోనే రూ.550 కోట్ల భారీ లోటు అంటే.. దేశ పరిస్థితి ఎవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ధరలు అదుపు తప్పాయి. నిత్యావసరాలు సామాన్యుడి అందుబాటులో లేవు. ఆర్థిక వృద్ధి కన్నా దేశాన్ని నిలబెట్టడం ప్రధాన లక్ష్యంగా మారింది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం బొగ్గు గనుల జాతీయీకరణ వంటి కఠినమైన కానీ తప్పనిసరి నిర్ణయాలు తీసుకుంది. ఆ బడ్జెట్లో ఆశల కన్నా ఆవశ్యకత ఎక్కువ. అభివృద్ధి కన్నా బతకడం ముఖ్యమైన దశ అది.
ఆశలకు రూపమిచ్చిన బడ్జెట్ - 1997
అదే దేశం... కానీ సరిగ్గా 24 ఏళ్ల తర్వాత, పూర్తిగా భిన్నమైన పరిస్థితి. 1990ల సంస్కరణల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కొత్త దారిలో నడవడం ప్రారంభించింది. ఈ మార్పులకు బలమైన ఊపునిచ్చింది 1997 బడ్జెట్. ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త ఆశలు నింపింది. అందుకే దాన్ని 'డ్రీమ్ బడ్జెట్'గా పిలిచారు. అప్పటివరకు భారంగా ఉన్న పన్నుల వ్యవస్థను ఆయన సూటిగా సవరించారు. గరిష్ట ఆదాయ పన్నును 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడం అప్పటి మధ్యతరగతికి పెద్ద ఊరట.
పన్నులు తగ్గిస్తే ఆదాయం తగ్గుతుందన్న భయం అప్పట్లో చాలామందికి ఉంది. కానీ చిదంబరం నమ్మకం వేరే. పన్నుల భారం తగ్గితే ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తారని, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ఆయన విశ్వసించారు. అదే జరిగింది. వ్యాపారాలు ఊపందుకున్నాయి. పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా 1997లో సుమారు రూ. 18,700 కోట్లుగా ఉన్న ఆదాయపు పన్ను వసూళ్లు, కొన్నేళ్లలోనే లక్షల కోట్లకు చేరాయి. ఆ బడ్జెట్ భారతదేశాన్ని నమ్మకంతో ముందుకు నడిపించిన మైలురాయి అయింది.
గతం చెప్పే పాఠం... వర్తమానం ముందు నిలిచిన ప్రశ్న
నేడు భారత్ మరో కీలక బడ్జెట్కి సిద్ధమవుతోంది. Budget 2026పై అంచనాలు, ఆశలు భారీగా ఉన్నాయి. గతం మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది-సంక్షోభంలో అయినా, సంస్కరణల్లో అయినా బడ్జెట్ పాత్ర కీలకం. 1973 బడ్జెట్ దేశాన్ని నిలబెట్టే ప్రయత్నం అయితే, 1997 బడ్జెట్ దేశాన్ని పరుగులు పెట్టించింది. ఇప్పుడు పరిస్థితులు వేరు. కానీ సవాళ్లు కొత్తవి... ద్రవ్యోల్బణం, మధ్యతరగతి భారం, ఉపాధి, వృద్ధి అవసరం.
ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టబోయే Budget 2026 కూడా ఒక కీలక మలుపుగా మారుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. పన్నుల విషయంలో ఊరట ఉంటుందా? అభివృద్ధి-సామాన్యుడు మధ్య సమతుల్యత సాధ్యమవుతుందా? భారత బడ్జెట్ చరిత్ర చెబుతున్నది ఒక్కటే.. ఒక బడ్జెట్ దేశ భవితవ్యాన్ని మార్చగలదు. ఇప్పుడు ఆ అవకాశం మరోసారి తలుపు తడుతోంది.












Click it and Unblock the Notifications