మండిపోతున్న పెట్రోల్ ధరలు: మూడేళ్ల గరిష్టానికి చేరిక
రోజువారీ ధరల్లో మార్పు విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. తాజాగా మూడేళ్ల గరిష్ఠానికి ధరలు చేరాయి.
న్యూఢిల్లీ: రోజువారీ ధరల్లో మార్పు విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. తాజాగా మూడేళ్ల గరిష్ఠానికి ధరలు చేరాయి. గరిష్ఠంగా 2014, ఆగస్ట్ 1న పెట్రోల్ లీటర్కు రూ.81.75గా ఉండగా.. తాజాగా బుధవారం ముంబైలో అది రూ.79.48కి చేరింది.
ఢిల్లీలో కూడా ఈ ఏడాది జులై 1 నుంచి చూసుకుంటే రూ.7.29 పెరిగింది. తాజాగా, లీటర్ పెట్రోల్పై రూ. 8పైసలు, డీజిల్పై రూ. 10పైసలు పెరిగింది. అయినా ఈ పద్ధతినే కొనసాగిస్తామని ఈ మధ్యే పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం గమనార్హం. ఈ పద్ధతి వల్లే డీలర్లకైనా, వినియోగదారులకైనా లాభం ఉంటుందన్నది మంత్రి వాదన. రోజువారీగా అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గితే ఇక్కడా తగ్గుతుంది.
అయితే ఇది ప్రవేశపెట్టినప్పటి నుంచీ పెరగడమే తప్ప తగ్గింది లేదు. కాగా, గతంలో 15 రోజులకోసారి పెట్రోల్ ధరలను సమీక్షించేవాళ్లు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలకు అనుకూలంగా దేశీయ మార్కెట్లో రేట్లను సవరించడం జరిగేది.
అయితే ఈ ఏడాది జూన్ నుంచి పరిస్థితి మారిపోయింది. జూన్ 16 నుంచి ప్రభుత్వం రోజు వారి సమీక్షకు అనుమతి ఇచ్చింది. ఈ విధానం ప్రారంభం అయిన నాటి నుంచి ధరలు దూసుకుపోతున్నాయి. 2014 ఆగస్టు తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు మరోసరి గరిష్టస్థాయికి చేరాయి.
జులై 1న హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 67.11. ఇప్పుడు రూ. 74.52. లీటర్కు రూ. 7.41 పెరిగింది. అంటే సుమారు 11శాతం పెరిగింది. డీజిల్ ధర లీటరు ప్రస్తుతం రూ. 63.79. జులై 1 ధర రూ. 58.23 ఉండేది. అంటే రెండున్నర నెలల్లోపే లీటరు ధర రూ. 5.56 పెరిగింది. అంటే సుమారు 10 శాతం పెరుగుదల ఉంది.