అక్కడా గాజు గ్లాసు గుర్తు.. ఓ ఎమ్మెల్యే!
అమరావతి: పవన్ కల్యాణ్ సారథ్యాన్ని వహిస్తోన్న జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేసి.. ఒక సీటుకు మాత్రమే పరిమితమైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓ స్వతంత్ర అభ్యర్థి గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేసి, విజయం సాధించారు. ఆయనే-రాకేశ్ దౌల్తాబాద్. హర్యానాలోని బాద్షాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు గాజు గ్లాసు గుర్తు మీద. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్, జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ) వంటి పార్టీల అభ్యర్థుల మీద పోటీ చేశారు. తిరుగులేని మెజారిటీతో ఘన విజయాన్ని అందుకున్నారు.
హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కమలనాథులు అధికారాన్ని అందుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆశ చూపించినా.. ఆయన బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఆ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. రాకేశ్ దౌల్తాబాద్ గాజు గ్లాసు గుర్తు మీద ఘన విజయాన్ని సాధించడం మన రాష్ట్రంలో చర్చనీయాంశమౌతోంది. సాధారణంగా- ఏదైనా ప్రాంతీయ పార్టీకి కేటాయించిన ఎన్నికల గుర్తును.. వేరే రాష్ట్రాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తుంటుంది కేంద్ర ఎన్నికల కమిషన్.
హర్యానా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాకేశ్ దౌల్తాబాద్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. ఆ గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి మద్దతు ప్రకటించిన అయిదుమంది ఎమ్మెల్యేల్లో ఆయనా ఒకరు. రాకేశ్ తో పాటు రణ్ ధీర్ సింగ్ గొల్లెన్ (ఫుండ్రి), బల్రాజ్ కుండు (మెహమ్), రంజిత్ సింగ్ (రనియా), గోపాల్ గోయల్ కందా (సిర్సా) బీజేపీకి మద్దతు తెలిపారు.
అనంతరం జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ) సహకరాంతో బీజేపీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనోహర్ లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.