కేంద్రం గుడ్న్యూస్: వారిని సొంతూళ్లకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లకు అనుమతి..గైడ్ లైన్స్ జారీ..!
న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్లో ఉన్న పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలకు చెందిన కార్మికులు పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాలకు జీవనం కోసం వెళ్లారు. లాక్డౌన్ అమల్లోకి రావడంతో వలస కూలీలు ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. అంతేకాదు కొందరు సొంత ఊళ్లకు చేరుకోవాలని కాలినడకన సొంతూళ్లకు బయలుదేరారు. మార్గమధ్యలో కొందరు ప్రాణాలు కూడా విడిచారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అలాంటి వారికి ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైలు సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిక్కుకుపోయిన ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తూ అందులో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సూచనలు చేసింది. రైల్వే స్టేషన్లలో, ప్లాట్ఫాంలపై, రైలులోపల కానీ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన సూచనల్లో పేర్కొంది. ఇక ప్రతి రాష్ట్రానికి ఒక నోడల్ ఆఫీసర్లను రైల్వేశాఖ నియమించనుంది. నోడల్ ఆఫీసర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటుంది.
ఇక రైల్వే శాఖ కూడా ప్రత్యేక సూచనలు విడుదల చేస్తుంది. టికెట్ల కొనుగోలు, సామాజిక దూరం ఇతరత్ర సురక్షిత చర్యలులాంటివాటిపై రైల్వే శాఖ సూచనలు జారీచేస్తుంది. ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడిన తర్వాత జార్ఖండ్కు ప్రత్యేక రైలును పంపింది. తెల్లవారు జామున లింగంపల్లి స్టేషన్ నుంచి 1250 మంది వలస కూలీలతో జార్ఖండ్కు బయలుదేరింది ఈ రైలు. వలస కూలీలు రైల్లో సామాజిక దూరం పాటించేలా అన్ని చర్యలు చేపట్టింది రైల్వేశాఖ.