వందనం..అభివందనం: ప్రముఖ ఉర్దూ నవలా రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్కు గూగుల్ గౌరవం
ప్రముఖ ఉర్దూ నవలా రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ 107వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన హోమ్ పేజ్పై ఆమె చిత్రాన్ని ఉంచి గౌరవించింది. ఇస్మత్ చుగ్తాయ్ జీవించి ఉంటే ఉర్దూ రచనల స్థాయి ఉన్నతమైన శిఖరాన నిలిచి ఉండేవని గూగుల్ తన పేజ్పై రాసుకొచ్చింది. 1942లో చుగ్తాయ్ రాసిన వివాదాస్పద కథ 'లిహాఫ్'తో ఆమె వెలుగులోకి వచ్చారు.
ఆమె కథల్లో వాస్తవాలు, ప్రపంచ స్థాయి స్కాండల్స్, గాసిప్స్, ఉత్తర్ ప్రదేశ్లో చిన్న ఇళ్లలో నివసించే కుటుంబాల గురించి కనిపిస్తాయి. చుగ్తాయ్ రాసిన లిహాఫ్ కాస్త వివాదాస్పదంగా మారింది. ఈ కథ ఆ రోజుల్లో వచ్చిన ఒక పుకారుపై అల్లింది. అలీఘర్కు చెందిన బేగం తన ఇంట్లో పనిచేసే పనిమనిషితో లైంగిక సంబంధం నెరిపారనే పుకారుపై కథ రాశారు.ఇది అప్పట్లో వివాదాస్పదంగా మారింది.
మొత్తం 10 మంది పిల్లలున్న ఆమె కుటుంబంలో చుగ్తాయ్ సంఖ్య తొమ్మిది. తన రెండో సోదరుడు అజీమ్ బేగ్ చుగ్తాయ్ నేతృత్వంలో ఆమె నవలలు రాయడంలో రాటుదేలారు. అజీమ్ కూడా చిన్న కథలు రాసేవారు. సమాజంలో మూఢనమ్మకాలపై ఆమె రాసిన నవలలు అత్యద్భుతంగా ఉండేవి. ఈ మూఢనమ్మకాలు, అంటరానితనంతో ప్రజలు ఎలా నలిగేవారో తెలుపుతూ ఆమె రాసిన నవలలు ఆరోజుల్లో భేష్ అనిపించేలా ఉండేవి.
1915 ఆగష్టు 21న ఉత్తర్ప్రదేశ్లోని బదయూన్లో జన్మించిన ఇస్మత్ సాహితీరంగంలో ఆమె చేసిన సేవలకు గారు భారత ప్రభుత్వం 1976లో ఆమెను పద్మశ్రీతో గౌరవించింది.దేశ విభజన సమయంలో ఇస్మత్ రాసిన నవలలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అప్పట్లో మహా రచయితల మధ్య ఇస్మత్ను నిలుచోబెట్టాయి. 1996లో దీపా మెహత నుంచి వచ్చిన ఫైర్ అనే చిత్రం ఇస్మత్ రాసిన నవల లిహాఫ్ ఆధారంగా తీసినదే కావడం విశేషం.
ఇందులో షబానా అజ్మీ, నందితా దాస్లు ప్రధాన పాత్రలు పోషించారు. ఎక్కువగా మానవ సంబంధాలపైనే ఇస్మత్ నవలలు రాశారు. అందులో సామాజిక ముసుగులో నడుపుతున్న హోమో సెక్సువాలిటీపై ఆమె రాసిన నవలలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాదు ఇలాంటి నవలలు రాసినందుకు గాను ఆమె కోర్టుల్లో విచారణ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె రాసిన పొట్టి కథలు " కఫీర్ " "ధీత్" కూడా పెద్ద దుమారమే రేపాయి. ఈ నవలల్లో ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ను ఆమె అవమానించారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.