ఎయిర్టెల్కి బిగ్ రిలీఫ్ : 100శాతం విదేశీ పెట్టుబడులకు టెలికాం గ్రీన్ సిగ్నల్
ఓవైపు నష్టాలు, మరోవైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలతో సతమతమవుతున్న భారతీ ఎయిర్టెల్ కంపెనీకి భారీ ఊరట లభించింది. సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) 49శాతం నుంచి 100 శాతానికి పెంచుకునేలా టెలికాం డిపార్ట్మెంట్(DoT) ఆమోదం తెలిపింది. కంపెనీలో విదేశీ పెట్టుబడుదారులకు 74శాతం వాటా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కూడా ఆమోదం తెలిపింది. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ సమాచారంలో కంపెనీ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
జనవరి 23 లోపు రూ. 35,586 కోట్ల బకాయిలను భారతి ఎయిర్టెల్ చెల్లించాల్సి ఉంది. అంతకు మూడు రోజుల ముందే విదేశీ పెట్టుబడుల పెంపుకు ఆమోదం లభించడం సంస్థకు భారీ ఊరట అనే చెప్పాలి. ఎయిర్టెల్ బకాయిల్లో రూ .21,682 కోట్లు లైసెన్స్ ఫీజు, మరో రూ.13,904 కోట్లు స్పెక్ట్రమ్ బకాయిలు (టెలినార్, టాటా టెలిసర్వీస్ బకాయిలను మినహాయించి) ఉన్నాయి.
కాగా,నష్టాల నుంచి బయటపడేందుకు భారతి టెలికాం సుమారు రూ.4900 కోట్ల విదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్కు చెందిన సింగ్ టెల్ అనే కంపెనీ సహా మరికొన్ని సంస్థల నుంచి ఆ మొత్తాన్ని పెట్టుబడుల రూపంలో సేకరించనుంది. గతేడాది ప్రారంభంలోనూ విదేశీ పెట్టుబడుల కోసం ఎయిర్టెల్ టెలికాం శాఖకు దరఖాస్తు చేసుకునన్నప్పటికీ.. తిరస్కరణకు గురైంది.విదేశీ పెట్టుబడులపై పూర్తి స్థాయి సమాచారం అందించకపోవడంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు అప్పట్లో టెలికాం శాఖ తెలిపింది.