ప్రధాన సేవకుడిని: మోడీ, ‘సాధించిన విజయాలివే’
సహరాన్పూర్: తాను దేశ ప్రజలకు ప్రధానిని కాదు.. ప్రధాన సేవకుడ్నే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో 125కోట్ల మంది భారతీయులకు సదా సేవలందిస్తూ వచ్చానని ప్రకటించారు.
యూపీఏ పాలనలో దేశవ్యాప్తంగా నెలకొన్న నిరాశావాదం స్థానంలో ఆశాదీపాన్ని, అభివృద్ధి అనే మనస్థితిని (మూడ్ని) ఎన్డీఏ సర్కారు తీసుకురాగలిగిందని నరేంద్రమోడీ చెప్పారు. ప్రజాధనాన్ని దోచుకోవడాన్ని నిలువరించగలిగిన తమ సర్కారు... పేదలకు, రైతులకు అంకితమయిందని చెప్పారు.
ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశీలించడాన్ని తాను ఆహ్వానిస్తానన్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లోని షహరాన్పూర్లో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.
మోడీ తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాల గురించి వెల్లడించారు. ప్రభుత్వ నిధుల దోపిడీని అరికట్టామని చెప్పారు. యూపీ నుంచి ఎంపీనైన తాను 'యూపీ వాలా'నని చెప్పుకొన్నారు. చక్కెర రైతులకు రూ.14,000 కోట్ల మేర ఉన్న బకాయిలను రూ.700 కోట్లకు తగ్గించేలా తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందనీ, ఇతర ప్రభుత్వాలు వారిని పట్టించుకోనేలేదనీ విమర్శించారు. చక్కెర కర్మాగారాలు మునుపటి మాదిరిగా రైతుల్ని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రభుత్వాలు రావచ్చు.. పోవచ్చునని కానీ ఎన్నికలు మాత్రం శాశ్వతంగా నిర్ణీత కాల వ్యవధిలో జరుగుతూనే ఉంటాయన్నారు. కేవలం ప్రజలకు అన్ని విధాలుగా సేవలందించేందుకే ఏ ప్రభుత్వమైనా ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. 'గత రెండేళ్ల కాలంలో మా ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనించారు. పేదల సేవకే అంకితమవుతామన్న మాటకు కట్టుబడి అనేక సంక్షేప పథకాలను చేపట్టాం..అందరి ఆశలకు అనుగుణంగా పనిచేశాం'అని తెలిపారు.
ప్రజలకు అంకితభావంతో సేవలందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలను బలోపేతం చేసేందుకే కృషి చేస్తున్నామన్నారు.తాను కూడా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి రాష్ట్రాల ఇబ్బందులేమిటో తెలుసునన్నారు. కేంద్ర ఖజానాకు 35శాతం నిధులు మాత్రమే చెందుతాయని, మిగతాదంతా రాష్ట్రాల వాటానేనని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశం మారుతున్నా.. కొందరి ఆలోచనలు మాత్రం మారడం లేదన్నారు.
పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారుల నిర్మాణానికి విశేష ప్రాధాన్యతనిచ్చామని.. ఆ విధంగా పేదల జీవితాల్లో గుణాత్మక పరివర్తనను తీసుకొచ్చామని మోదీ తెలిపారు. చెరకు రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని, చక్కెర పరిశ్రమలు నిజాయితీగా పనిచేస్తే ఏ రైతుకూ అన్యాయం జరగదన్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం చేయడానికి ప్రయత్నించినా సహించేది లేదని చక్కెర మిల్లులను ప్రధాని హెచ్చరించారు.
అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తూ రెండేళ్ల క్రితం ఈ జాడ్యం పరాకాష్టకు చేరుకుందని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఎలాంటి అవినీతి ఆరోపణా రాలేదన్నారు. గత ప్రభుత్వం దేశ సంపదనంతా కొల్లగొట్టిందంటూ కాంగ్రెస్ పాలనా తీరుపై మోడీ విరుచుకు పడ్డారు. మహిళలకు సాధికారత కల్పించామని, బేటీ బచావ్.. బేటీ పడావ్ ద్వారా బాలికలకు అండగా నిలిచామన్నారు.
భారత దేశంలో బాలికలకు సాధికారత కల్పించక పోతే భారత దేశం ఎలా నిర్మితమవుతుందని ప్రధాని ప్రశ్నించారు. తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్' ధనికుల కోసం కాదని, పేదల కోసమేనని స్పష్టం చేస్తూ 'దీని వల్ల పరిసరాలు పరిశుభ్రమవుతాయి. పేదలకు రోగాల బారిన పడే ప్రమాదం ఉండదు'అని తెలిపారు.
గత ప్రభుత్వ పాలనలో కంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల నిర్మాణం రెండింతలైందన్నారు. గ్రామాలన్నింటినీ రహదారులతో అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్న ఆయన 'దేశంలో 18వేల గ్రామాల్లో ఒక్క విద్యుత్ స్తంభం కూడా లేకపోవడం సిగ్గుచేటు..'అని తెలిపారు. దేశంలో వంద కోట్ల మంది విద్యుత్ సబ్సిడీని స్వచ్ఛంగా వదులుకోవడం తమ ప్రభుత్వం సాధించిన ఘనతగా పేర్కొన్నారు.
దేశంలోని యువత ఉద్యోగాలను పొందాల్సిందేనని వెల్లడించిన మోడీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తేజోవంతగా ఉన్న ఏకైన దేశం భారతావనేనంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 'నేను ఏమి చేసినా దానిపై నిఘా ఉంటుంది. ఈ పరిణామాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతి సెకనుకు, ప్రతి రూపాయికీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిందే..'నని ఉద్ఘాటించారు.
'ఎంతో డబ్బును (గతంలో) దోచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో నేనున్నాను. ఆ దోపిడీ నాకెంతో విస్మయాన్ని కలిగించింది. ఇలాంటి దోపిడీ కోసం ప్రజలు మనకు అధికారాన్ని అప్పగిస్తారా అని ఆశ్చర్యపోయాను. ఈ పోకడకు అడ్డుకట్ట వేయాలని ప్రతిన బూనాను' అని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.