మిజోరం గవర్నర్ రాజీనామా: బాధ్యతలు తీసుకున్న 10 నెలల వ్యవధిలోనే..
తిరువనంతపురం: మిజోరం గవర్నర్ కమ్మనం రాజశేఖరన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అందజేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. మిజోరం బాధ్యతలను అస్సాం గవర్నర్ జగదీష్ ముఖికి అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి.. ఇంత హడావుడిగా రాజీనామా చేయడం వెనుక పెద్ద కథే ఉంది.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాజశేఖరన్ బీజేపీ తరఫున పోటీ చేయాలని నిర్ణయించుకోవడమే దీనికి అసలు కారణం. కేరళకు చెందిన రాజశేఖరన్ చాలాకాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పదవిలో ఉన్న సమయంలోనే.. కేంద్రప్రభుత్వం రాజశేఖరన్ పేరును గవర్నర్ గా నామినేట్ చేసింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీనితో ఆయన గత ఏడాది మే 25వ తేదీన మిజోరం గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించారు.
22 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు..! అందులో జైషే మహ్మద్ సంస్థలెన్నో తెలుసా?
ఏడాది పాటు కూడా లేరు..
గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖరన్ కనీసం ఏడాది పాటు కూడా ఆ పదవిలో గడపలేకపోయారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన తిరువనంతపురం స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
శశిథరూర్ పై పోటీకి సై..
తిరువనంతపురం లోక్ సభ స్థానం.. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంచుకోట. గెలుపోటములు ఈ రెండు పార్టీల మధ్యే తిరుగాడుతోంది. ఒక్కసారి కూడా బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోలేదు. ప్రస్తుతం తిరువనంతపురం స్థానం కాంగ్రెస్ చేతిలో ఉంది. శశిథరూర్ ఇక్కడ లోక్ సభ సభ్యుడు. ఈ సారి కూడా శశిథరూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇదే స్థానం నుంచి పోటీ చేయడం ఖాయం.
కాంగ్రెస్, వామపక్షాలపై బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం రాజశేఖరనే. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిజోరం గవర్నర్ గా ఉన్న ఆయనతో రాజీనామా ఇప్పించింది. ఫలితంగా ఆయన మరోసారి క్రియాశీలకంగా వ్యవహరిస్తారని పార్టీ భావిస్తోంది.