పన్నీర్ 'ఏకాకి'.. సీఎం కాకుండా గవర్నర్ కావాలనే అడ్డుకుంటున్నారు : శశికళ
గవర్నర్ వెంటనే చెన్నైకి వచ్చి తనతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని శశికళ డిమాండ్ చేశారు.
చెన్నై: అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ గవర్నర్ విద్యాసాగర్ రావు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే తాను సీఎం కాకుండా గవర్నర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని శశికళ ఆరోపించారు.
మెజారిటీ ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నారన్న సంగతి తెలిసి కూడా గవర్నర్ ప్రజాస్వామ్య విరుద్దంగా వ్యవహరిస్తున్నారని శశికళ విమర్శించారు. గవర్నర్ వెంటనే చెన్నైకి వచ్చి తనతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. కాగా, గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు అన్నాడీఎంకె ఎంపీలు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశికళ గవర్నర్ పై ఆరోపణలు చేశారు. అదే సమయంలో పన్నీర్ సెల్వంపై కూడా విమర్శలు గుప్పించారు. పన్నీర్ సెల్వం తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలో సంక్షోభం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నీర్ ఇప్పుడు ఏకాకి అని శశికళ ఎద్దేవా చేశారు.