‘‘కన్సాస్ కాల్పుల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది’’
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. గురువారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు.
కన్సాస్ లో ఓ శ్వేతజాతీయుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ యువకుడు అలోక్ కూడా గాయపడ్డాడు.
ఈ అంశంపై గురువారం రాజ్య సభలో గందరగోళం నెలకొంది. ఉదయం పార్లమెంట్ ఆవరణలో టీఎంసీ ఎంపీలు అమెరికా దాడులకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన కూడా నిర్వహించారు.
ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రభుత్వం వచ్చే వారం ఒక ప్రకటన చేస్తుందని చెప్పారు. అయినప్పటికీ రాజ్య సభలో గందరగోళం నెలకొనడంతో సభను రేపటికి వాయిదా వేశారు.
జీఎస్టీ పై మీడియాతో.. మోడీ
వస్తు, సేవల పన్ను బిల్లు అమలుకు తుదిరూపు ఇచ్చే ప్రక్రియ ఈ సమావేశాల్లోనే ముగుస్తుందని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గురువారం పార్లమెంట్ రెండో దఫా బడ్జెట్ సమావేశాలు మొదలైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జీఎస్టీ అమలు అంశంలో ఉన్న అవరోధాలను అధిగమిస్తామని ఆశిస్తున్నట్లు మోడీ చెప్పారు. జీఎస్టీ అంశంలో అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు పాజిటివ్ దృక్పథంతో ఉన్నట్లు ఆయన తెలిపారు.