ఆ రెండు డ్రగ్స్.. కరోనా వైరస్పై యుద్దంలో చిగురిస్తున్న ఆశలు..
కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తలమునకలయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా చికిత్సల్లో వాడుతున్న డ్రగ్స్ను సైతం కరోనా వైరస్పై పరీక్షించి చూస్తున్నాయి.
ఇందులో భాగంగా చైనా,జపాన్ వంటి దేశాలు 'ఫవిపిరవిర్' అనే యాంటీ-వైరల్ డ్రగ్ను కరోనా వ్యాక్సిన్గా అభివృద్ది చేయడంపై ఫోకస్ చేశాయి. భారత ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్(TFORD) సైతం ఫవిపరివీర్ యాంటీ వైరల్ డ్రగ్,ఇమ్యూన్-మాడ్యులేటర్ డ్రగ్-తోసిలిజుమాబ్ కోవిడ్-19 చికిత్స విధానంలో ఆశాజనకంగా కనిపిస్తున్నాయని తాజాగా పేర్కొంది.
ఈ రెండు డ్రగ్స్కి సంబంధించిన క్లినికల్ ట్రయల్ డేటా,సైంటిఫిక్ లిటరేచర్ ఆధారంగా వీటిపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ను ఉపయోగించేందుకు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న హెల్త్ వర్కర్స్లో కరోనా నియంత్రణ కోసం దీన్ని సూచించింది. అయితే సంసిద్దత సూచికలో ఈ డ్రగ్ బాగానే స్కోర్ చేసినప్పటికీ... పొటెన్షియల్ పారామీటర్లో మాత్రం ఎక్కువ స్కోర్ చేయలేదు.
ఫవిపిరవిర్ యాంటీ వైరల్ డ్రగ్ను జపాన్లో ఇన్ ఫ్లూయెంజా చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం 18 క్లినికల్ ట్రయల్స్లో దీనిపై పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకూ వెల్లడైన రెండు అధ్యయనాల్లో ఇది పాజిటివ్ ఫలితాలను ఇవ్వగా.. మిగతా ట్రయల్స్ ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది.
Recommended Video
తోసిలిజుమాబ్ డ్రగ్ను ప్రపంచవ్యాప్తంగా పలు రకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్ చికిత్సల్లో వాడుతున్నారు. కరోనాను ఎదుర్కొనే సత్తా దీనికి ఉందా అన్న విషయాన్ని కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దీనిపై 24 క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. తీవ్ర అనారోగ్యం బారినపడినవారిలో దీని ప్రభావం మెరుగ్గా ఉందని ఇప్పటివరకూ వెల్లడైన విషయాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ డేటా అంతా అందుబాటులోకి వచ్చి.. దాన్ని సమీక్షిస్తే.. కరోనా చికిత్సలో వీటి ఉపయోగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.