చిన్నమ్మే మా 'సీఎం', పన్నీర్ అమ్ముడుపోయారు: శశికళకు భారీ మద్దతు
పన్నీర్ సెల్వం అమ్ముడుపోయారని, అందుకే శశికళనే తాము ఇప్పుడు సీఎంగా కోరుకుంటున్నామని పోయెస్ గార్డెన్ వద్దకు భారీ ఎత్తున చేరుకున్న మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.
చెన్నై: తమిళ రాజకీయాల్లో ఏ క్షణానికి ఏం జరగబోతుందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. నిన్నటిదాకా పరిణామాలన్ని పన్నీర్ సెల్వంకే అనుకూలంగా ఉన్నట్టు కనిపించినా.. పోయెస్ గార్డెన్ ఎదుట నేటి పరిణామాలను గమనిస్తే.. శశికళ మళ్లీ బలం పుంజుకుంటున్నారన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.
నిన్నటిదాకా ప్రజల్లో పన్నీర్ పట్ల విపరీతమైన సానుభూతి ఉండగా.. ఆయన వెనుక కేంద్రం ఉందన్న ఆరోపణలతో కొంతమంది మద్దతుదారులు శశికళ వైపు మళ్లుతున్నట్టుగా తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే తమిళనాడువ్యాప్తంగా పలువురు మద్దతుదారులు, కార్యకర్తలు పోయెస్ గార్డెన్ వద్దకు తరలి వచ్చారు.
పన్నీర్ సెల్వం అమ్ముడుపోయారని, అందుకే శశికళనే తాము ఇప్పుడు సీఎంగా కోరుకుంటున్నామని మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. ఒకరోజు ఆలస్యమైతే కావచ్చు గానీ సీఎం అయ్యేది మాత్రం చిన్నమ్మే అని తేల్చి చెబుతున్నారు. ఇంతకుముందు వరకు అన్నాడీఎంకె మద్దతుదారుల్లో జయలలిత ఫోటో కనిపించగా.. ఇప్పుడు జయలలిత-శశికళ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో వారి చేతుల్లో దర్శనమిస్తుండటం గమనార్హం.
మనదేశం ప్రజాస్వామ్య దేశమైనప్పుడు చిన్నమ్మకు సీఎం పదవి కట్టబెట్టడం పట్ల గవర్నర్ ఎందుకు జాప్యం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో గవర్నర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని అని నిలదీశారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వంకు మద్దతుగా ఉన్నది ఏడు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని వారితో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, బలనిరూపణ చేయడం అసాధ్యం అని వారు అంటున్నారు.