అసెంబ్లీ ఎన్నికల్లో భార్యను గెలిపించుకున్న రవీంద్ర జడేజా - ఇక్కడా ఆల్రౌండరే..!!
సిమ్లా: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిందే జరుగుతోంది. వార్ వన్ సైడ్ అయింది. భారతీయ జనత పార్టీ తిరుగులేని మెజారిటీని సాధిస్తోంది. థంపింగ్ విక్టరీని అందుకోనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బీజేపీ దిమ్మతిరిగే స్థాయిలో అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంటోంది. కాంగ్రెస్ గానీ, ఆమ్ ఆద్మీ పార్టీ గానీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. పూర్తిగా చేతులెత్తేశాయి. గుజరాతీయులు ఈ రెండు పార్టీలను ఘోరంగా తిరస్కరించారు. గంపగుత్తగా బీజేపీకి ఓటు వేశారు.

ఎగ్జిట్ పోల్స్ కంటే..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలన్నీ వాస్తవ రూపాన్ని దాల్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కనీసం 120 నుంచి 140 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. దీనికి మించిన ఫలితాలు వెలువడుతున్నాయి. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్లో బీజేపీ- 150కి పైగా నియోజకవర్గాలను దక్కించుకుంటోంది. బీజేపీ ప్రభంజనం ముందు అటు కాంగ్రెస్ గానీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ గానీ నామమాత్రంగా మిగిలాయి. దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి.

లక్షకు పైగా..
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, పటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఘన విజయం సాధించారు. తమ ప్రత్యర్థులపై తిరుగులేని మెజారిటీని సాధించారు. భూపేంద్ర పటేల్ ఏకంగా 1,07,960 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అమీ యజ్ఞిక్ను ఓడించారు. అహ్మదాబాద్ రీజియన్ పరిధిలోని ఘట్లోడియాలో ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే.

పటిదార్ ఉద్యమ నాయకుడు..
పటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ కూడా భారీ మెజారిటీని సాదించారు. వీరంగామ్ నుంచి ఆయన గెలుపొందారు. కాంగ్రెస్కు చెందిన లఖాభాయ్ భర్వాద్ను ఓడించారాయన. గుజరాత్ను బీజేపీ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిందని, రెండు దశాబ్దాల బీజేపీ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గానీ, అశాంతియుత వాతావరణం నెలకొనలేదని చెప్పారు. అవే బీజేపీకి ఘన విజయాన్ని కట్టబెట్టాయని పేర్కొన్నారు.

ఆప్ సీఎం అభ్యర్థి కూడా ఓటమి..
ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ సైతం పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఖంబాలియా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి ములుభాయ్ బేరా చేతిలో పరాజయాన్ని చవి చూశారు. కాగా- అందరి దృష్టినీ ఆకర్షించిన మరో నియోజకవర్గం జామ్ నగర్ నార్త్. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా రివాబా జడేజా పోటీ చేశారు. విజయబావుటాను ఎగరవేశారు.

రివాబా గెలుపు..
రవీంద్ర జడేజా భార్య ఆమె. రివాబాను గెలిపించుకోవడానికి రవీంద్ర జడేజా విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహించారు. ఆ శ్రమ వృధా కాలేదు. రివాబా జడేజాకు ఘన విజయాన్ని అందించాయి. రవీంద్ర జడేజా రాజకీయాల్లో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నట్టయింది. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకుండా భార్యను గెలిపించుకోవడానికి రవీంద్ర జడేజా ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్నారనే విమర్శలు ఎదురైనప్పటికీ- వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదు.












Click it and Unblock the Notifications