పీసీసీ అధ్యక్షుడు అలిగారా?: పాస్తో కాంగ్రెస్ డీల్ ఓకే.. తొలి జాబితాలో 20 పటేళ్లే!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు గత 22 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నువ్వా? నేనా? అన్నట్లు పోటీ పడుతున్నాయి. యంగ్ టర్క్లు హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీ మద్దతుతో నూతన జవసత్వాలతో పూర్తిగా యువ రక్తంతో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకి ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించారు. కానీ అభ్యర్థుల ఎంపికలో జాప్యం, పార్టీ అధిష్ఠానవర్గం అనుచిత వైఖరి అసంత్రుప్తితో పోటీ చేయడానికి నిరాకరించినట్లు వచ్చిన వార్తలను భరత్ సింగ్ సోలంకి కొట్టి పారేశారు.
హార్దిక్ పటేల్ సారథ్యంలోని పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్)తో సీట్ల సర్దుబాటు, రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో అంగీకారం కుదిరింది. మరోవైపు ఆదివారం రాత్రి 77 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. తొలిదశ వచ్చేనెల తొమ్మిదో తేదీన పోలింగ్ జరిగే నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి మంగళవారం తుది గడువు. కాగా, భరత్ సింగ్ సోలంకి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ముందే ప్రకటించానని గుర్తు చేశారు.

భరత్
ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా, పార్లమెంట్కు రెండుసార్లు గెలుపొందానని గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకి చెప్పారు. ఆయన కేంద్ర మంత్రిగానూ పని చేశానన్నారు. అయితే ఆదివారం అర్థంతరంగా న్యూఢిల్లీ నుంచి సొంత ఊరు బొర్సాద్ కు బయలుదేరి వెళ్లారు. మూడున్నర నెలలుగా ఇంటికి రానందు వల్లే వచ్చానని వివరణ ఇచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విధేయుడినని చెప్పారు. ‘పాస్' నేతలు తమకు టిక్కెట్లు కేటాయించాలని కోరనే లేదన్నారు. పార్టీ భవిష్యత్ ప్రయోజనాల రీత్యా ఆ సంస్థ నేతలకు టిక్కెట్లు ఇస్తున్నామని తెలిపారు. శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శరద్ యాదవ్ ఆధ్వర్యంలోని జేడీయూ చీలిక వర్గంతో పొత్తు విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

నేడు రాజ్కోట్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుపై నేడు హార్దిక్ ప్రకటన
కాంగ్రెస్ పార్టీ, హార్దిక్ పటేల్ సారథ్యంలోని పాస్ మధ్య పాటిదార్లకు ఓబీసీల కోటాలో రిజర్వేషన్ల కల్పనపై అంగీకారం కుదిరింది. అధికారంలోకి వస్తే విద్యా ఉద్యోగ రంగాల్లో పటేళ్లకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. రిజర్వేషన్లకు రాజ్యాంగ చట్టబద్ధతపై రాజ్కోట్లో సోమవారం జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే అంశంపై పాస్ నాయకుడు హార్దిక్ పటేల్ ప్రకటన చేస్తారని సంస్థ కన్వీనర్ దినేశ్ బంభానియా తెలిపారు. ఆయన హార్దిక్ పటేల్కు అత్యంత సన్నిహితుడు. రిజర్వేషన్ల కల్పనపై కాంగ్రెస్ పార్టీ తమ ముందు పెట్టిన ఫార్ములా అంగీకారమేనని బాంభానియా చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగే సమావేశానికి హార్దిక్ పటేల్ హాజరు కాకపోవడం గమనార్హం. ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకి, సీనియర్ నేతలు సిద్ధార్థ్ పటేల్, బాబూభాయి మంగుకియా తదితరులు పాల్గొన్నారు. తమ చర్చలు ఫలప్రదం అయ్యాయని, ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరిందని భరత్ సింగ్ సోలంకి చెప్పారు.

విజయ్ రూపానీతో ఇంద్రానిల్ రాజ్యగురు పోటీ
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 77 మందితో కూడిన తొలి జాబితాలో 20 మంది అభ్యర్థులు పాటిదార్ సామాజిక వర్గానికి చెందిన వారే. పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం గమనార్హం. శక్తి సింగ్ గోహిల్, పాస్ నాయకుడు లలిత్ వాసోవా కూడా అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. శక్తి సిగంగ్ గోహిల్ ఈ దఫా కచ్ జిల్లాలోని మాంద్వి స్థానం నుంచి పోటీ చేస్తారు. రాజ్ కోట్ వెస్ట్ స్థానం నుంచి సీఎం విజయ్ రూపానీతో ఇంద్రానిల్ రాజ్యగురు పోటీ పడుతుండటంతో ఇరు పార్టీలకు కీలకం కానున్నది. ఇక మరో సిట్టింగ్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాదియా, మంత్రి బాబూ భోఖ్రియాతో పోర్ బందర్ స్థానంలో ముఖాముఖీ పోటీ పడతారు. ఎస్టీల్లో 11 మందితోపాటు ఏడుగురు ఎస్సీ అభ్యర్థులనూ ప్రకటించింది. కాగా హార్దిక్ పటేల్ 20, ఓబీసీ కోటాలో అల్పేశ్ ఠాకూర్ 12 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే బీజేపీ 182 స్థానాలకు 106 స్థానాల అభ్యర్థుల పేర్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications