రేపే గుజరాత్ ఎన్నికల తొలి సమరం, సీఎంతో సహ 997 మంది, 2.16 కోట్ల ఓటర్లు!
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల తొలి సమరానికి సర్వం సిద్ధం అయ్యింది. గుజరాత్ శాసన సభ తొలి దశ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. గుజరాత్ లో మొత్తం 182 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. శనివారం 89 శాసన సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది.
సీఎంతో సహ 977 మంది
శనివారం జరగనున్న పోలింగ్ లో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహ మొత్తం 977 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశ ఎన్నికల్లో 57 మంది మహిళలు బరిలో ఉన్నారు. మొత్తం 2.12 కోట్ల మంది వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
400 మంది రెబల్స్
బీజేపీ 89 స్థానాల్లో, కాంగ్రెస్ 87 స్థానాల్లో, బీఎస్పీ 64, ఎన్సీపీ 30 స్థానాల్లో పోటీపడుతోంది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో నాలుగు వందల మందికి పైగా స్వతంత్రంగా పోటీచేస్తున్న వారు ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజ్కోట్ పశ్చిమ నియోజక వర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
హోరా హోరీ
తొలి దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. అటు గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా ప్రచారం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగింది.
ఐదు సారి బీజేపీ!
గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ మాకు తిరుగులేదని నిరూపించింది. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ వరుసగా ఐదోసారి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది.
ఒక్క చాన్స్ ఇవ్వండి
మరోవైపు ఏళ్ల తరబడి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారైనా అధికారాన్ని దక్కించుకోవాలని ఆశపడుతోంది. మరోవైపు త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోయే యువరాజు రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలే తొలి సవాలుగా నిలిచాయి.