ఉపరాష్ట్రపతిగా గులాంనబీ ఆజాద్ - బీజేపీ కొత్త ఎత్తుగడ :వెంకయ్యకు ప్రమోషన్ దక్కేనా..!!
ఉపరాష్ట్రపతి గా ఎవరికి అవకాశం ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు నిర్ణయానికి వచ్చేసారా. ఢిల్లీ కేంద్రంగా జరగుతున్న పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. వచ్చే మార్చిలో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంది. అదే సమయంలో ఫిబ్రవరిలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటి ఫలితాల ఆధారంగా రాష్ట్రపతి అభ్యర్థి ఎలక్టోరల్ కాలేజీలో వచ్చే మార్పుల ప్రకారం దీనిపై తుది నిర్ణయానికి రానున్నారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపీ ఏయే ప్రాంతీయ పార్టీలపై ఎంత మేరకు ఆధారపడాల్సి ఉంటుందో తేలుతుంది.

రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల పై లెక్కలు
పైగా ఈ ఎన్నికల ప్రభావం బీజేపీ రాజ్యసభ సీట్లపై కూడా పడుతుంది. దానిని బట్టి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమా..పోటీ ఉంటుందా..ఎవరి బలాలు ఏంటనేది క్లారిటీ వస్తుంది. అయితే, రాష్ట్రపతితో పాటుగా ఉప రాష్ట్రపతిని సైతం ఏకగ్రీవంగా ఎన్నుకొనేం దుకు ప్రధాని మోదీ నాయతక్వంలో బీజేపీ ముఖ్య నేతలు కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా.. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ను ఉప రాష్ట్రపతిని చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఉప రాష్ట్రపతి పై బీజేపీ కొత్త వ్యూహలతో
అధికార బీజేపీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసి.. ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవ ఎన్నికకు ప్రతిపాదించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న టీ-23 నేతల్లో అజాద్ కీలకంగా ఉన్నారు. అదే సమయంలో సోనియా నాయకత్వ పైన విధేయత ప్రదర్శిస్తున్నారు. జమ్ము కాశ్మీర్ కు చెందిన సీనియర్ పొలిటీషియన్ గా... కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న ఆజాద్ పైన ఫోకస్ చేయటం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక కోసం శాసనసభ్యులపై కూడా ఆధారపడాల్సి ఉండగా, ఉపరాష్ట్రపతి కోసం కేవలం లోక్సభ, రాజ్యసభ సభ్యుల బలంపై మాత్రమే ఆధారపడాల్సి ఉంటుంది.

గులాం నబీ ఆజాద్ వైపు బీజేపీ సుముఖంగా
జమ్మూ కశ్మీర్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, కశ్మీర్ వ్యవహారాలపై మంచి అవగాహన ఉన్న గులాంనబీ ఆజాద్కు ప్రధాని నరేంద్ర మోదీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగిసినప్పుడు మోదీ ఆయనను ఆకాశానికెత్తుతూ ప్రశంసించడమే కాకుండా కంటతడి పెట్టారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించి.. ఎన్నికలు నిర్వహించే విషయంలో ఆజాద్ సేవలను మోదీ ఉపయోగించుకుంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆజాద్కు తటస్థ నేతగా అన్ని వర్గాల్లో మంచి పేరుంది.

కాంగ్రెస్ క్యాంపు పైన బీజేపీ అస్త్రం
ఇదే సమయంలో గతంలో జరిగిన పరిణామాలను సీనియర్లు గుర్తు చేస్తున్నారు. వాజపేయి ప్రభుత్వ కాలంలో బీజేపీకి సన్నిహితురాలైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నజ్మాహెప్తుల్లా కూడా 2004లో కాంగ్రెస్తో తన దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆమెను బీజేపీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నుకుని 2007లో ఉపరాష్ట్రపతి పదవికి పోటీగా రంగంలోకి దించింది. అయితే అప్పుడు యూపీఏ అధికారంలో ఉండడంతో ఆ కూటమి తరఫున హమీద్ అన్సారీ పోటీ చేసి గెలిచారు.

రెండు అత్యున్న పదవుల్లో.. సమీకరణాలకే కీలకం
ఆ తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక నజ్మాహెప్తుల్లాను మణిపూర్ గవర్నర్గా నియమించారు. కేంద్రంలో ప్రస్తుతం బీజేపీయే అధికారంలో ఉన్నందున ఆజాద్ ఎన్నిక సులభంగా జరుగుతుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆజాద్ కూడా ఇప్పటినుంచే బీజేపీయేతర పార్టీల నాయకులను క లిసి చర్చలు జరపడం ప్రారంభించారు. ఆజాద్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా తాము ప్రతిపాదిస్తే..కాంగ్రెస్ సైతం మద్దతివ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. కాశ్మీర్ నేతకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వటం ద్వారా రాజకీయ సమీరణాల్లోను అనుకూలత పెరుగుతుందని బీజేపీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాది ఉప రాష్ట్రపతి - దక్షిణాదికి రాష్ట్రపతి దక్కేనా
అయితే, ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య నాయుడుకు మరో టర్మ్ పొడిగింపు ఉంటుందనే ప్రచారమూ సాగింది. తొలి సారి ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుని సైతం ప్రధాని మోదీ- అమిత్ షా టీం వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. రాజ్యసభ ఛైర్మన్ హోదాలోనూ ఉప రాష్ట్రపతి ఉండటంతో బీజేపీకి కీలకంగా మారింది. అయితే, రాష్ట్రపతి ఎంపిక ఆధారంగానే ఉప రాష్ట్రపతి ఎంపిక సమీకరణాలు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గులాంనబీ ఆజాద్ ను ప్రచారం లో ఉన్నట్లుగా ఉపరాష్ట్రపతిగా చేయాలని నిర్ణయిస్తే..దక్షిణాది వ్యక్తికి రాష్ట్రపతిగా అవకాశం ఇస్తారనేది మరో సమీకరణ.
Recommended Video

వెంకయ్య నాయుడుకు ప్రమోషన్ దక్కుతుందా
దీంతో దక్షిణాది వ్యక్తికి రాష్ట్రపతి ఇవ్వాలంటే..ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడుకే ప్రమోషన్ ఇచ్చి రాష్ట్రపతిని చేస్తారా అనేది మరో ఆసక్తి కర చర్చ మొదలైంది. ఇదే సమయంలో బీహార్.. ఉత్తర ప్రదేశ్.. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీంతో.. శదర్ పవార్ సైతం ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నారు. రవి శంకర్ ప్రసాద్ పేరు ప్రచారంలో ఉంది. పక్కా భవిష్యత్ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని రాజకీయంగా నిర్ణయాలు చేసే ప్రధాని మోదీ.. అమిత్ షా ఈ రెండు కీలక పదవుల విషయంలో ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications