షాకింగ్: వేలాది ఆధార్ కార్డులు.. పాడుబడ్డ బావిలో, ఎవరివి.. అసలేం జరిగింది?
ముంబై: ఒకవైపు ఆధార్ నంబర్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తుండగా.. షాకింగ్ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక పాడుబడిన బావిలో వేలాది ఒరిజినల్ ఆధార్ కార్డులు దర్శనమివ్వడం కలకలం రేపింది. కార్డులు పాక్షింగా దెబ్బతిన్నప్పటికీ వివరాలు చదవగలిగేలా ఉన్నాయి.
మహారాష్ట్ర యవత్మాల్లోని షిండేనగర్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతున్న దృష్ట్యా అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకునేందుకు కొంతమంది యువకులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో షిండేనగర్లో ఉన్న ఒక పాడుబడ్డ బావిని బాగు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ యువకుల ప్రయత్నాన్ని జిల్లా కలెక్టర్ రాజేస్ దేశ్ముఖ్ కూడా అభినందించారు. వీరి ప్రయత్నంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి.
భారీ ఊరట: కేసు పూర్తయ్యేంత వరకు నో డెడ్లైన్, ఆధార్పై తేల్చేసిన సుప్రీం!
ఈ నేపథ్యంలో ఆ బావిలోని చెత్తను తొలగిస్తుండగా అందరూ విస్తుపోయే సంఘటన జరిగింది. ఆ బావిలో వేలాది ఒరిజినల్ ఆధార్కార్డులున్న గోనెసంచులు బయటపడ్డాయి. నైలాన్ గోనె సంచుల్లో ప్యాక్ చేసి, రాళ్లు కట్టి మరీ వాటిని ఆ బావిలో పారవేశారు.
వాటిని చూడగానే అవాక్కయిన అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. దీనిపై దర్యాప్తు కోసం ఒక కమిటీని కూడా వేశామని, పూర్తి నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు.