గురువాయురప్పా.. ఒక్కరోజే 377 పెళ్లిళ్లా: ఆ ముహూర్తం మళ్లీ రాదు
కేరళలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రg గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం ఓ అరుదైన ఘట్టానికి వేదిక కాబోతోంది. ఈ నెల 23వ తేదీన ఆదివారం నాడు ఆ ఘటన చోటు చేసుకోబోతోంది. మలయాళ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన చింగం మాసం మొదటి కావడం వల్ల ఈ ఆలయ ప్రాంగణంలో ఏకంగా 377 పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఒకే రోజు ఈ స్థాయిలో రికార్డు సంఖ్యలో పెళ్లిళ్లు నమోదు కావడం ఈ ఆలయ సుదీర్ఘ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతకుముందు 2024 సెప్టెంబర్ 8వ తేదీన ఒకే రోజు 334 వివాహాలు జరిగాయి. గురువాయూర్ ఆలయానికి సంబంధించి ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రికార్డు. ఇప్పుడది మటుమాయం అయింది. ఆగస్టు 23వ తేదీకి ఇంకా గడువు ఉన్నందున.. ఈ పెళ్లిళ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదు. క్రమంగా 400 మార్కును దాటుతుందని దేవస్వం అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేపట్టారు.

ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ ప్రాంగణంలో మరో శాశ్వత కళ్యాణ మండపాన్ని నిర్మిస్తోన్నారు. దీని పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నాలుగు కల్యాణ మండపాలు అందుబాటులో ఉంటోన్నాయి.. ఇది అయిదవది అవుతుంది. ఈ నూతన మండపాన్ని చెన్నైకి చెందిన ఒక భక్తుడొకరు ఆలయానికి విరాళంగా అందజేశారు. మండపం నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఆయనే భరిస్తోన్నారు. కొథచిరకు చెందిన ప్రముఖ శిల్పి సుధీల్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం సాగుతోంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలుగు కల్యాణ్ మండపాల్లో ఒకేసారి 200 వివాహాలను జరిపించడానికి వీలు ఉంది. ఈ సంఖ్య దాటినప్పుడు ఆలయ ప్రాంగణంలో తాత్కాలికంగా అదనపు షెడ్లను ఏర్పాటు చేస్తుంటారు దేవస్వం అధికారులు. నిరంతరం పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ నూతన శాశ్వత మండపాన్ని నిర్మిస్తోన్నారు. మండపం నంబర్ 1 గా చింగం మాసం మొదటి రోజు నుండే అందుబాటులో తీసుకుని రానున్నారు.
భక్తుల సౌకర్యార్థం కళ్యాణ మండపాల సంఖ్యను పెంచడమే కాకుండా స్వామివారి సులభ దర్శనాన్ని మరింత మెరుగుపరచడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భక్తుల దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు దేవస్వం బోర్డు ఈ నెల 4 నుండి ప్రయోగాత్మకంగా నూతన వర్చువల్ క్యూ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ ఆధునిక ఆన్లైన్ దర్శన ప్రక్రియ ద్వారా పండుగ సమయాల్లో సామాన్య భక్తులకు క్యూల్లో వేచి ఉండే కష్టాలు తప్పుతాయి. ప్రస్తుతానికి ఈ వర్చువల్ క్యూ సదుపాయాన్ని మంగళ, గురువారాల్లో మాత్రమే అమలు చేస్తోన్నారు. ఈ రెండు రోజుల్లో గరిష్టంగా 2,400 మంది వరకు భక్తులు వర్చువల్ విధానంలో స్వామివారిని దర్శించుకోవచ్చు.




Click it and Unblock the Notifications