షాకింగ్ : ఆ గ్రామంలో 300 జనాభా... 144 మందికి కరోనా పాజిటివ్...
కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో ఉన్న ఆబనలి గ్రామంలో 50 శాతం మంది గ్రామస్తులు కరోనా బారినపడ్డారు. గ్రామంలో మొత్తం 300 జనాభా ఉండగా ఇందులో 144 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. మంగళవారం(ఏప్రిల్ 20) నిర్వహించిన యాంటీ జెన్ టెస్టుల్లో ఈ విషయం తేలింది. అయితే దీన్ని ధ్రువీకరించేందుకు గ్రామస్తులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.
ఆబనలి గ్రామస్తుల్లో ఎక్కువమంది మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఇటీవల అక్కడ జనతా కర్ఫ్యూ విధించడంతో స్వగ్రామానికి తిరిగొచ్చారు. దీంతో మహారాష్ట్రలోనే వీరికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన కొంతమంది జ్వరం,ఒళ్లు నొప్పులతో స్థానిక హెల్త్ సెంటర్కి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. వీరికి కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో గ్రామంలో వీలైనంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 144 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.
ఆబనలి గ్రామానికి చెందిన మారిథి అనే వ్యక్టి మాట్లాడుతూ... ఏప్రిల్ 10న గ్రామానికి చెందిన ముగ్గురికి మొదట కరోనా సోకిందన్నారు. అయితే అధికారులు వారి కాంటాక్టులను ట్రేస్ చేయలేదన్నారు. దీంతో వారు ఊరంతా తిరగడంతో చాలామంది కరోనా బారినపడ్డారని చెప్పారు. ప్రస్తుతం ఆ గ్రామంలోకి రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 23,558 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 116 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12.22 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 13,672కి చేరింది. ప్రస్తుతం 1,76,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,75,284 మంది వివిధ ఆస్పత్రుల్లో ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. మరో 904 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 10,32,233 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్లో ఎక్కువమంది వైరస్ బారినపడుతున్నారని... ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్,వెంటిలేటర్ ఇతరత్రా మెడికల్ సరఫరాలపై ప్రభుత్వం ఫోకస్ చేయాలని కోరారు.