రెండు నాల్కల ధోరణి: హార్దిక్ పటేల్పై ‘బేషరం’ ప్రచారం.. ఛత్తీస్గడ్ మంత్రికి దన్నుగా బీజేపీ
రెండు నాల్కల రాజకీయ ధోరణికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోపేరు. స్టింగ్ ఆపరేషన్లో రాసలీలలు చేస్తూ ఛత్తీస్గఢ్ మంత్రి బయటపడితే అది బ్లాక్ మెయిల్ రాజకీయం అన్నారు కమలనాథులు.
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న పటీదార్ల నాయకుడు హార్దిక్ పటేల్ తనపై 'మార్పిడి చేసిన సెక్స్ సీడీ'ని భారతీయ జనతా పార్టీ త్వరలోనే విడుదల చేస్తుందని చెప్పిన విషయం తెల్సిందే. ఆయన చెప్పినట్లు ఒకటి కాదు, ఆ పార్టీ రెండు వీడియో సీడీలను విడుదల చేసింది. ఒక వీడియోలో హార్దిక్ పటేల్ ఓ మహిళతో సెక్స్లో పాల్గొన్నట్లు మరో వీడియోలో హార్దిక్ పటేల్ ఆల్కహాల్ సేవిస్తున్నట్లు ఉంది. 'హార్దిక్ ఎక్స్పోజ్డ్' అనే హాష్టాగ్తో బీజేపీ కార్యకర్తలు, వారి మద్దతుదారులు ఈ వీడియోలపై ట్వీట్లు చేస్తుండగా, 'రియల్ ట్రూత్ ఆఫ్ హార్దిక్ పటేల్', బేషరమ్ హార్దిక్ పటేల్' అంటూ గుజరాత్ బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగం కన్వీనర్ ఈ వీడియాలపై సోషల్ మీడియాలో విస్త్రుత ప్రచారం చేస్తున్నారు.
కానీ ఇటీవల ఛత్తీస్గఢ్ మంత్రి రాజేష్ మునత్ రాసలీలలు బయటపెట్టిన సీనియర్ జర్నలిస్టుపైనే అక్కడి బీజేపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. బీబీసీ మాజీ జర్నలిస్టు వినోద్ వర్మనూ అరెస్ట్ చేసింది. కానీ విమర్శలు తోడవ్వడంతో విచారణను సీబీఐకి అప్పగించింది. ఇదీ బీజేపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
వ్యూహ రచనలో నిమగ్నమైన కమలనాథులు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశ, బీజేపీ, ప్రత్యేకించి ప్రధాని మోదీ - అమిత్ షా జోడీ రాజకీయ భవిష్యత్ను నిర్దేశించనుండటంతో వ్యూహ రచనలో కమలనాథులు దేనికైనా వెనుకాడటం లేదని తెలుస్తున్నది. రెండేళ్ల క్రితం పటేళ్లకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్ల కల్పన కోసం ఉద్యమించిన హార్దిక్ పటేల్ అంటే పాటిదార్లు ప్రాణం పెట్టేలా మారారు. 1990వ దశకం నుంచి పటేళ్ల మద్దతుతో 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ‘హార్దిక్ పటేల్' కొరుకుడు పడని కొయ్యగా మారారు. 2007, 2012 ఎన్నికల్లో కేశూభాయి పటేల్ వంటి వారు ఓట్లను చీల్చడంతో పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి 22 ఏళ్లుగా బీజేపీలో అధికారంలో కొనసాగ గలిగింది. కానీ రెండేళ్లుగా హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ప్రస్తుతం గుజరాత్లో, తర్వాత జాతీయ స్థాయిలో అధికారానికి దూరమవుతామా? అన్న ఆందోళన కమలనాథుల్లో మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముందే ఈ పరిణామం ఊహించిన హార్దిక్ పటేల్
హార్దిక్ పటేల్కు వ్యతిరేకంగా ‘పాస్' కన్వీనర్గా హార్దిక్ పటేల్ రాసలీలలకు పాల్పడ్డారని మూడు, నాలుగు రోజులుగా ‘సెక్స్ వీడియోల'తో కూడిన సీడీలను విడుదల చేస్తోంది. గమ్మత్తేమిటంటే బీజేపీ సీడీ ఒకటి విడుదల చేస్తుందని హార్దిక్ పటేల్ ముందే మీడియాకు చెప్పారు. తీరా సీడీ విడుదలైన తర్వాత మాత్రం ఈ వీడియోలో ఉన్నది తాను కాదని హార్దిక్ పటేల్ చెప్పేశారు. ఆయనైతే మాత్రం తప్పేముందని, అది పూర్తి వ్యక్తిగత అంశమని ఆయనకు మద్దతిస్తున్నవారు కౌంటర్ ట్వీట్లు చేస్తున్నారు. సెక్స్ వీడియోలో కనిపిస్తున్నది హార్దిక్ పటేల్ అవునా? కాదా ? చర్చనీయాంశమే కాదని, ఆయనే అనుకుంటే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ‘ప్రైవసీ ప్రాథమిక హక్కు' అనే వారంతా వాదిస్తున్నారు.
హార్దిక్పై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం ఇలా
ఇటీవల బీజేపీ చత్తీస్గఢ్లో వ్యవహరించిన తీరు, గుజరాత్లో వ్యవహార శైలికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఛత్తీస్గఢ్ బీజేపీ నేత రమణ్ సింగ్ క్యాబినెట్ సహచరుడు కలిగి ఉన్నందుకు మాజీ బీబీసీ జర్నలిస్ట్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ జర్నలిస్ట్కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నానా యాగి చేయడంతో ఆ జర్నలిస్ట్పై పోలీసులు కేసు కూడా పెట్టారు. జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్న సదరు మంత్రిపై స్టింగ్ ఆపరేషన్కు వెళ్లడంతో ఆ జర్నలిస్ట్ మంత్రిగారి శృంగారలీల క్లిప్పింగ్ దొరికింది. ఇక ఆ విషయాన్ని అంతటితో ఆపేస్తే నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఓ మహిళపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిఘా ఏర్పాటుచేసిన ‘స్నూప్గేట్ స్కామ్'లో బీజేపీ వ్యక్తిగత స్వేచ్ఛను గాలికి వదిలేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్ధించారు.
సమయానుకూలంగా వైఖరి మార్చుకుంటున్న బీజేపీ
ఆధార్కు సంబంధించి ‘ప్రైవసీ'పై సుప్రీం కోర్టులో జరిగిన వాదనల్లోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతీయులకు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు కాదని వాదించింది. అంటే బీజేపీ ఎప్పటికప్పుడు వ్యక్తిగత ప్రైవసీపై తన వైఖరిని మార్చుకుంటోంది. అంటే ఎప్పటి ఏ వైఖరి ప్రయోజనకరమో అప్పటికీ ఆ వైఖరిని అవలంబిస్తోందన్నమాట! ఇప్పుడు హార్దిక్ పటేల్ సెక్స్ వీడియోలో ఆయన పరస్పర అంగీకారంతోనే సెక్స్లో పాల్గొన్నట్లు స్పష్టం అవడమే కాకుండా మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు కూడా లేదని, అందుకని చత్తీస్గఢ్లో పోలీసులు వ్యవహరించిన తీరులోనే ప్రజల్లోకి ఈ వీడియో విడుదల చేసిన, వీడియాను రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తులపై కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని కూడా పటేల్ మద్దతుదారులు ట్వీట్లు చేస్తున్నారు.
దారి మళ్లించేందుకేనని విపక్షాల ఆరోపణ ఇలా
అనూహ్యంగా పరిస్థితుల్లో మార్పు రావడంతో మంత్రి రాజేష్ మునత్ సెక్స్ సీడీ కేసు విచారణ బాధ్యతను చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకే అప్పగించింది. సీనియర్ జర్నలిస్టు వినోద్ వర్మ మంత్రి సెక్స్ సీడీతో బ్లాక్ మెయిల్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నకిలీ సెక్స్ సీడీని సృష్టించి తనను అప్రతిష్టపాలు జేసేందుకు వినోద్ వర్మ యత్నించాడని మంత్రి రాజేష్ ఫిర్యాదుతో జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ఫిర్యాదుపై జర్నలిస్టుతోపాటు కాంగ్రెస్ నాయకుడి బంధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలోనే సంచలనం రేపిన ఈ కేసును పక్కదారి పట్టించేందుకే సీబీఐకు అప్పగించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
సీఎం విజయ్ రూపానీ, బీజేపీ గుజరాత్ చీఫ్ వాఘానీలదే ఇలా బాధ్యత
హార్దిక్ పటేల్కు వ్యతిరేకంగా విడుదలైన రెండు అశ్లీల సీడీలపై ఆయన సారథ్యంలోని ‘పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్)' నేతలు ప్రతిస్పందించారు. మరో 52 సీడీలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పాస్ నేతలు చెప్పారు. వాటిలో 22 హార్దిక్ పటేల్కు వ్యతిరేకంగా, మిగతా పాస్ నేతలపై 30 సీడీలు ఉన్నాయని కన్వీనర్ దినేశ్ బాంభానియా చెప్పారు. బీజేపీ మార్పింగ్ చేసిన సీడీలు విడుదల చేయిస్తున్నదని చెప్పారు. పుణెకు చెందిన గుర్తు తెలియని వ్యాపారి కమలనాథులకు లబ్ది చేకూర్చేందుకు రూ.40 కోట్లు ఖర్చు చేసి మార్పింగ్ చేసిన వీడియోలు సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు. దీనికి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు జితూ వాఘానీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పాస్ అంతర్గత వ్యవహారమన్న నితిన్ పటేల్
హార్దిక్ పటేల్కు వ్యతిరేకంగా మీడియాకు లీక్ చేసిన వీడియోలతో తమకు పాత్ర లేదని బీజేపీ వాదిస్తున్నది. ‘పాస్' నేతలే 52 సీడీలు విడుదల అవుతాయని చెప్తున్నారని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ గుర్తు చేశారు. ఆ మార్పింగ్ సీడీల తయారీ పాత్ర ‘పాస్'దేనని, అది హార్థిక్ పటేల్, ఆయన అనుయాయుల అంతర్గత వ్యవహారం అని, తమకు సంబంధం లేదని తేల్చేశారు. మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే ‘పాస్'మాజీ సహచరుడు చిరాగ్ పటేల్ను బీజేపీలోకి స్వాగతించారు. రాజకీయ ప్రయోజనాల కోసం హార్దిక్ పటేల్.. కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం గమనార్హం. 14 శాతం జనాభా గల పాటిదార్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘పాస్' ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం గమనార్హం. అయినా హార్దిక్ పటేల్ అప్రతిష్ఠ పాల్జేయడానికి బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తున్నదో స్పష్టంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 24 ఏళ్ల కుర్రాడికి గల ప్రజాదరణ అంటే కమలనాథులు భయపడాల్సిన అవసరమేమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.