పదవి వదులుకోవద్దని అర్థమైంది,ఈసారి గెలిస్తే: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఎవరైనా సరే వచ్చిన పదవిని వదులుకోకూడదనే విషయం తనకు అనుభవపూర్వకంగా అర్థమయిందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండమంటూ ఢిల్లీ ప్రజలు అధికారం అప్పగిస్తే, కేవలం 49 రోజులకే కేజ్రీవాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
దీనిపై ఆయన మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ.. రాజకీయాలకు కొత్త కావడంతో కొన్ని తప్పులు చేశామని,ముఖ్యంగా కుర్చీ విలువ ఏంటో తెలిసి వచ్చిందని, కుర్చీని ఎప్పుడూ వదలరాదనే విషయం అర్థమైందని చెప్పారు.
ఈసారి అధికారంలోకి వస్తే కుర్చీని మాత్రం వదలమని, ఐదేళ్లు పాలిస్తామన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఢిల్లీలో 47 శాతం ఓట్లు తమకే పడతాయన్నారు. తాము ఢిల్లీలో అధికారంలో ఉన్న 49 రోజుల్లో ఎంతో సాధించామని చెప్పారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు వంద రోజుల్లో సాధించిన దానికంటే తాము ఎక్కువే చేయగలిగామని చెప్పారు. కాగా, ఈసారి అధికారంలోకి వస్తే కుర్చీని వీడమని, ఐదేళ్ల పాటు పాలన సాగిస్తామని కేజ్రీవాల్ చెప్పడం గమనార్హం.