అక్టోబర్ 2న హజరే దీక్ష, బిల్లును వ్యతిరేకించిన కేజ్రీ
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజరే మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో మహాత్మాగాంధీ పుట్టిన రోజు అక్టోబర్ 2న అన్నా హజారే నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.
మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసేకరణ బిల్లుతో పాటు, సైనికులకు ఒకే ర్యాంకు - ఒకే పింఛను అంశాలపై ఈ దీక్ష చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భూసేకరణ బిల్లులో ముఖ్యమైన నిబంధన రైతుల అనుమతితో భూములు సేకరించాలనే దానిని సవరించడంపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్లాజును బిల్లులో చేర్చి, రైతుల అనుమతితోనే భూసేకరణ జరపాలని అన్నాహజారే డిమాండ్ చేస్తున్నారు. యూపీఏ అధికారంలో ఉండగా జన లోక్పాల్ బిల్లుకోసం అన్నాహజారే నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
భూసేకరణ బిల్లును వ్యతిరేకించిన కేజ్రీ
ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భూసేకరణ బిల్లును వ్యతిరేకించారు. ప్రధాని బుధవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భూసేకరణ బిల్లుతో పాటు పలు అంశాలపై చర్చించారు.
కేంద్ర, రాష్ట్రాల సంబంధాలకు సంబంధించి, కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి చర్చించడానికి మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నీతిఆయోగ్ సమావేశంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరినట్లు తెలుస్తోంది.