పకోడీ స్టాల్ కోసం లోన్ కావాలి: సాయం చేయండంటూ స్మృతి ఇరానీకి యువకుడి లేఖ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల తన ప్రసంగంలో ఉపయోగించిన 'పకోడీల వ్యాపారం' అనే పదం ఇప్పట్లో భారతీయ జనతా పార్టీని ఇప్పట్లో వీడేట్లు లేదు. ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, తాజాగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి ఓ నిరుద్యోగి రాసిన లేఖ ఇప్పుడు ప్రతిపక్షాలకు మరో అస్త్రంగా మారేలా ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం విన్నానని.. ఉద్యోగం లేని తాను పకోడీల వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నానని.. అయితే అందుకు తగిన నిధులు లేవని అతడు వాపోయాడు. రుణాల కోసం బ్యాంకులకు వెళ్లినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ మేరకు స్మృతీ ఇరానీకి లేఖ రాశాడు.
'గౌరవనీయులైన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గార్కి.. బీజేపీకి కోటీకి పైగా కార్యకర్తలున్నారు. వారిలో నేను కూడా ఒకడిని. అమేథీ నియోజకవర్గం సోషల్ మీడియా ఇంఛార్జ్గా పని చేశాను. అయితే గత కొన్ని రోజులుగా జాబ్ కోసం నేను విశ్వప్రయత్నాలు చేస్తున్నాను' అని అశ్విన్ మిశ్రా అనే యువకుడు తన లేఖలో పేర్కొన్నాడు.
ఇంకా.. 'ఎక్కడా ఎలాంటి అవకాశం దొరకడం లేదు. ఏం చేద్దామా అనుకుంటున్నప్పుడు ప్రధాని మోడీజీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను. అందులో ఆయన మాట్లాడుతూ... పకోడీలు అమ్ముకోవడం గురించి చెప్పారు. వెంటనే నాకు ఓ ఆలోచన తట్టి జాబ్ ప్రయాత్నాలు మానేశాను. వ్యాపారం ప్రారంభించడానికి ముద్రా లోన్ కోసం బ్యాంకులు చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. ఎవరూ నాకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. వాళ్ల మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. లోన్ అడిగితే ఏవేవో చెబుతున్నారు. వాళ్ల మాటలు చూస్తుంటే.. లోన్ మంజూరుకావడం ఇప్పట్లో సాధ్యం కాదనిపిస్తోంది' అని మిశ్రా వాపోయాడు.
'లోన్ కోసం నేను ఎవరిని అడగాలి? నాకు ష్యూరిటీ ఇచ్చే వాళ్లు ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు నాముందున్నాయి. మరోవైపు ముద్రా లోన్ల ద్వారా 10 కోట్ల మందికి ప్రయోజనం కలిగిందని.. సాక్షాత్తు ప్రధాని మోడీ చెబుతున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రివర్గం కూడా ఇదే చెబుతూ వస్తోంది. ప్రధాని స్థాయి వ్యక్తి అబద్ధాలు చెబుతారు అనుకోవడం లేదు. ఆయనపై నాకు నమ్మకం, గౌరవం ఉంది. అయినా బ్యాంకుల వైఖరి మాత్రం.. ప్రధాని ఆశయాలకు విరుద్ధంగా ఉందని మాత్రం చెప్పగలను. ఈ విషయంలో నాకు మీరే ఏవిధంగానైనా సాయమందించగలరని నా నమ్మకం. ప్రధాని మోడీతో మాట్లాడి.. పకోడీల వ్యాపారం ప్రారంభించడానికి నాకు లోన్ ఇప్పించండి' అని అశ్విన్ మిశ్రా విన్నవించుకున్నాడు. కాగా, మిశ్రా లేఖ బీజేపీ ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతోందని పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.