నా కూతురికి అబార్షన్ చేయించండి: హైకోర్టును కోరిన రేప్ బాధితురాలి తండ్రి
చెన్నై: అత్యాచారానికి గురై గర్భం దాల్చిన తన మైనర్ కూతురి దీనస్థితి చూడలేక ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి మద్రాస్ హైకోర్టును కదిలించింది. తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురుకు గర్భస్రావం చేసేలా వైద్యులను ఆదేశించాలని కోరుతూ ఆ బాలిక తండ్రి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
తమిళనాడులోని ధారుపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆ బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చి 12 వారాలవుతోంది. తన కూతురుకు గర్భస్రావం చేయాలని బాలిక తండ్రి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను కోరగా న్యాయస్థానం అనుమతి తీసుకొస్తే, చేస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆ బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. తన బిడ్డకు ప్రసవం జరిగితే, ఆమె భవిష్యత్తులో తలెత్తుకు తిరగలేదని పేర్కొన్నారు.
ఈ కేసులో ఆ బాలిక తండ్రి చేసిన అభ్యర్థన సమర్థనీయమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ శివజ్ఞానం అన్నారు. గర్భస్రావ చట్టం 1971 సెక్షన్ 3(2)(బి) ప్రకారం ఆ బాలికకు వైద్యులు గర్భస్రావం చేయొచ్చని న్యాయమూర్తి తెలిపారు.