పసికందుతో సహా 13 మంది దుర్మరణం!
దేవభూమిగా పిలిచే హిమాచల్ ప్రదేశ్లో పకృతి పగబట్టింది. పచ్చని కొండల నడుమ రాకపోకలు సాగిస్తున్న అమాయక ప్రయాణికులపై మృత్యువు కొండచరియల రూపంలో విరుచుకుపడింది. రోడ్డు మూతపడటంతో రాత్రంతా ఒకేచోట వేచి చూసి, తెల్లవారాక దారి తెరచుకోవడంతో ఊపిరిపీల్చుకుని ప్రయాణం మొదలుపెట్టిన ప్రయాణికులను విధి వంచించింది. లాహౌల్-స్పితి జిల్లాలోని సాన్సారీ-కిల్లార్-తాండి మార్గంలో కాడు నాలా సమీపంలో శనివారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో టాటా సుమో వాహనంపై భారీగా బండరాళ్లు, మట్టిచరియలు పడి క్షణాల వ్యవధిలో వాహనం నుజ్జునుజ్జయ్యిపోయింది.
ఈ వాహనంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు. ఉదయ్పూర్ నుంచి పాంగి ప్రాంతానికి వెళ్తుండగా కొండపై నుంచి ఉన్నట్టుండి భారీ రాళ్లు పడటంతో లోపల ఉన్నవారికి కనీసం బయటకు పరిగెత్తే అవకాశం కూడా దక్కలేదు. ఈ ప్రమాదంలో ఆరు నెలల చిన్నారితో సహా ఏకంగా 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భారీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగించి, మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం నుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడగా, తీవ్రంగా గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
నీళ్లు తాగేందుకు ఆగిన కుటుంబంపై విరుచుకుపడ్డ రాయి!
ఇదే రోజు మండీ జిల్లాలోనూ మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుల్లు జిల్లా సుల్తాన్పూర్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు రెండు వాహనాల్లో ప్రసిద్ధ సింసా దేవి ఆలయానికి దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యంలో గుమ్మ సమీపంలో దాహం వేయడంతో రోడ్డు పక్కన వాహనాలు ఆపి నీళ్లు తాగుతున్నారు. ఆ సమయంలో కొండపై నుంచి అనూహ్యంగా ఒక పెద్ద బండరాయి దూసుకొచ్చి వారిపై పడింది. ఈ దుర్ఘటనలో రామేశ్వరి శర్మ అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుటుంబంలోని మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కొండ ప్రాంతాల్లో ప్రయాణాలంటే వణుకు!
హిమాచల్ కొండ ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ప్రమాదాలు స్థానికులతో పాటు పర్యాటకులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మృతుల కుటుంబాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సానుభూతి తెలిపారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున వర్షకాలం, ప్రయాణాల సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications