భారతరత్నకు ధ్యాన్చంద్ పేరు సిఫార్సు: వీడిన సస్పెన్స్
న్యూఢిల్లీ: అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న విషయంలో చెలరేగుతున్న ఊహాగానాలకు దాదాపుగా తెరపడినట్లే. మేజర్ ధ్యాన్ చంద్ పేరును భారత రత్నకు సిఫార్సు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం లోకసభలో ఈ విషయం చెప్పారు.
పలు వైపుల నుంచి వచ్చిన సిపార్శుల కారణంగా ధ్యాన్ చంద్ పేరును భారతరత్న పురస్కారం కోసం సిఫార్సు చేస్తూ ప్రధాని కార్యాలయానికి సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. లాంఛనప్రాయమైన సిఫార్సు అవసరం లేనప్పటికీ భారతరత్న కోసం ప్రధాని రాష్ట్రపతికి సిఫార్సు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
నిజానికి, ధ్యాన్ చంద్కు నిరుడే భారత రత్న పురస్కారం లభించాల్సి ఉండింది. అయితే, ఆ ఏడాది క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ఆ అవార్డు ఇచ్చారు. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్కు భారతరత్న ఇవ్వకపోవడంపై అప్పుడు అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తాయి.
అత్యంత ప్రతిభావంతుడని పేరు పొందిన ధ్యాన్ చంద్ భారత్ 1928, 1932, 1936ల్లో భారత్ హాకీలో ఓలింపిక్స్ క్రీడల్లో స్వర్ణపతకం గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఏడాది భారత రత్న పురస్కారం కోసం సుభాష్ చంద్రబోస్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వంటి పేర్లు వినిపించాయి.