తమిళనాడు మంత్రి తొలగింపును అడ్డుకున్న అమిత్ షా ? అర్ధరాత్రి గవర్నర్ కు ఫోన్ చేసి మరీ..!
తమిళనాడులో నిన్న సాయంత్రం నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీలాండరింగ్ కేసులో చిక్కుకుని అరెస్ట్ అయిన ఎక్సైజ్ మంత్రి సెంథిల్ బాలాజీని తప్పించాలంటూ కొంతకాలంగా సీఎం ఎంకే స్టాలిన్ పై ఒత్తిడి తెస్తున్న గవర్నర్ బీఎన్ రవి.. ఆయన పట్టించుకోకపోయే సరికి స్వయంగా రంగంలోకి దిగి కీలక నిర్ణయం తీసేసుకున్నారు. అయితే దాన్ని గంటల వ్యవధిలోనే నిలిపేశారు. నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
తమిళనాడులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ అరెస్టు చేసిన ఎక్సైజ్ మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి తప్పించాలని సీఎం స్టాలిన్ పై విపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి. అదే సమయంలో గవర్నర్ బీఎన్ రవి కూడా ఇదే వాదన మొదలుపెట్టారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని అనుసరించి కళంకిత మంత్రిని తప్పించాలంటూ స్టాలిన్ కు స్పష్టం చేశారు. కానీ స్టాలిన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో గవర్నర్ స్వయంగా మంత్రిని తొలగిస్తూ నిన్న నిర్ణయం తీసుకున్నారు.

నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఎక్సైజ్ మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి తప్పిస్తూ గవర్నర్ బీఎన్ రవి నిర్ణయం తీసుకోవడం, ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ కు లేఖ రాసి తెలియజేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో తమిళనాడు గవర్నర్ నిర్ణయం సంచలనం రేపింది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుండగానే అర్దరాత్రి మరో నిర్ణయం వెలువడింది. ఎక్సైజ్ మంత్రి బాలాజీని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నిలిపేస్తూ మరో ఆదేశం విడుదల చేశారు.

దీంతో గవర్నర్ బీఎన్ రవి నిర్ణయం నిలిపివేత వెనుక ఏం జరిగిందనే చర్చ సాగింది. దీని వెనుక చాలా కథే నడిచింది. మంత్రిని తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్న వెంటనే కేంద్రంలో హోంమంత్రి అమిత్ షాకు సమాచారం ఇచ్చారు. ఆయన దీనిపై మండిపడ్డారు. న్యాయ సలహా తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న గవర్నర్ కు అమిత్ షా క్లాసు పీకారు. మంత్రి తొలగింపుపై అటార్నీ జనరల్ సలహా తీసుకోమని చెప్పారు. దీంతో గవర్నర్ వెనక్కి తగ్గారు. ఇదే విషయం సీఎంకు కూడా మరో లేఖ రాసి తెలియజేశారు. అలా అమిత్ షా డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ పదవిని కాపాడారు.












Click it and Unblock the Notifications