లేటుగా వచ్చినా లేటెస్టుగా.. బీజేపీకి దిమ్మదిరిగే షాక్..!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న వేళ బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. అదే సమయంలో కర్నాటకలో విపక్షంగా ఉన్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలే కులసమీకరణాలు ఎక్కువగా కనిపించే కర్నాటకలో జరిగిన మూడు ఉపఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధులకు ఎదురుగాలి వీచింది. ఈ మూడింటిలో రెండు సీట్లు ఓ ఎత్తు అయితే మరో సీటు మరో ఎత్తుగా మారిపోయింది. దీని వెనుక షాకింగ్ కారణాలున్నాయి.
కర్నాటకలోని షిగ్గావ్ అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై కుమారుడు భరత్ బొమ్మైను నిలబెట్టింది. అలాగే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిపై చివరి నిమిషం వరకూ మల్లగుల్లాలు పడి చివరికి యాసిర్ ఖాన్ పఠాన్ కు సీటిచ్చింది. దీంతో ఇక్కడ బీజేపీ అభ్యర్ధి, మాజీ సీఎం కుమారుడు అయిన భరత్ బొమ్మై విజయం ఖాయమని అంతా భావించారు. కానీ అక్కడే బీజేపీకి భారీ షాక్ తగిలింది.

బీజేపకి ప్రతిష్టాత్మకమైన షిగ్గావ్ సీటులో బసవరాజ్ బొమ్మై గతంలో ఐదుసార్లు గెలిచారు. అలాంటి సీటులో ఆయన కుమారుడు భరత్ బొమ్మైను 25 వేల మెజార్టీతో ఓడించి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అభ్యర్ధి యాసిర్ ఖాన్ పఠాన్ విజయం సాధించారు. ముస్లిం సంస్థ అంజుమన్-ఎ-ఇస్లాం హుబ్బల్లి-ధార్వాడ్ అధ్యక్షుడు, హంగల్ మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు అయిన పఠాన్ తన ప్రచారానికి స్థానిక రాజకీయ అనుభవాన్ని జొడించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మద్దతు, క్షేత్రస్దాయిలో ఆయనకు లభించిన మద్దతు కూడా తోడవడంతో ఆయన సునాయాసంగా గెలుపొందారు.
షిగ్గావ్ లో యాసిర్ ఖాన్ పఠాన్ విజయం మామూలు విషయం కాదు. ఎందుకంటే బీజేపీ కంచుకోట అయిన షిగ్గావ్ లింగాయత్ బెల్ట్ లోకి వస్తుంది. ఇక్కడ ఎప్పటి నుంచో లింగాయత్ లు వరుసగా గెలుస్తున్నారు. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ లింగాయత్ లకు వ్యతిరేకంగా మిగతా ఓటు బ్యాంక్ అయిన దళితులు, ముస్లింలు, ఓబీసీల్ని ఏకం చేసింది. తద్వారా బీజేపీ ఆశలపై నీళ్లు చల్లింది.












Click it and Unblock the Notifications