హింస: జల్లికట్టు ప్రదర్శన ఇలా కట్టు తప్పింది
జల్లికట్టుపై చెన్నై మెరీనా బీచ్లో ప్రశాంతంగా జరుగుతున్న నిరసన ప్రదర్శన ఎందుకు పట్టు తప్పిందనేది ఆసక్తికరమైన విషయమే..
చెన్నై: జల్లికట్టు కోసం ప్రశాంతంగా జరుగతున్న నిరసన ప్రదర్శన ఒక్కసారిగా పట్టు తప్పి హింసకు దారి తీసింది. కొద్ది గంటల్లో ముగియాల్సిన ప్రదర్శన కార్యక్రమం హింసాత్మక సంఘటనలో ముగిసింది. నిజానికి, అసలు ఏం జరిగింది, ఎలా హింసాత్మకంగా మారింది అనే ప్రశ్నలకు జవాబులు వెతికితే ఆసక్తికరమైన విషయాలు తెలిసి వస్తున్నాయి.
వారం రోజుల పాటు జరిగిన ప్రదర్శనకు 500 కిలోల కేక్తో ముగింపు పలకాలని ఆందోళనకారులు భావించారు. డజను మంది తయారు చేసిన ఆ కేక్కు వారు ఆర్డర్ ఇచ్చారు అయితే, తీరా అది పోలీసులతో ఘర్షణ చెలరేగి అవాంఛనీయ సంఘటనలకు దారి తీసింది.
వివేకానంద హౌస్కు ఎదురుగా జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా ప్రశాంతంగా నిరసన తెలియజేస్తూ స్వచ్ఛంద సేవను కొనసాగిస్తున్న ఆందోళనకారులు స్థానికుల హృదయాలను దోచుకున్నారు. స్థానిక తమిళ సంస్కృిపై, దేశీయ పశు పోషణపై ప్రేమతో వారు నిరసన ప్రారంభించారు.

ఇలా ప్రేరణగా నిలిచారు...
వివేకానంద హౌస్కు ఎదురుగా ఆందోళనకారులు చేస్తున్న ప్రదర్శన ఇతర గ్రూపులకు ప్రేరణ ఇచ్చింది. విద్యార్థులతో పాటు ఇతరుల బీచ్కు వచ్చారు. చెన్నై నగరంలోని అన్ని దారులు కూడా అటే దారి తీసాయి. వివేకానంద హౌస్కు పక్కన సినీ స్టార్ల కోసం విద్యార్థులు వేదికను ఏర్పాటు చేశారు. సంప్రదాయ నృత్యకారులు, జానపద కళాకారులు ప్రదర్శనలు ఇవ్వసాగారు.

వేరే గ్రూపులు చేరాయి...
అయితే, విప్లవ గ్రూపులు కొన్ని ఆందోళనలో చేరాయి. తమిళ ఈలంకు మద్దతు ఇచ్చే కోవన్స్ మక్కలు అధికారం వంటి గ్రూపులు ఇందులో ఉన్నాయి. తమ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఆ గ్రూపులు వచ్చి చేరాయి. కొన్ని గ్రూపులు నేరుగా తమ భావాలను ప్రచారం చేయడం ప్రారంభించాయి. ప్రధాని మోడీకి, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలంతో కూడా నినాదాలు ఇవ్వడం, పాటలు పాడడం ప్రారంభించాయి. ఆదివారం వరకు చాలా ప్రశాంతంగా సమన్వయంతో సాగిన ఆందోళన దారి తప్పినట్లు అయింది.

ఆర్డినెన్స్ కాపీ అందించారు..
జల్లికట్టును కొనసాగించడానికి ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ కాపీని సోమవారం ఉదయం ఆరు గంటలకు విద్యార్థులకు అందించారు. ఆ కాపీ అందజేసిన తర్వాత పది నిమిషాల్లో ఆందోళనను విరమించి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. అయితే, దాన్ని నిపుణుల సాయంతో చదివి, అర్థం చేసుకోవడానికి తమకు ఒక్క రోజు పడుతుందని, ఆ తర్వాత సెలబ్రేట్ చేసుకుని వెళ్లిపోతామని విద్యార్థులు చెప్పారు.

లారెన్స్ ఇలా వచ్చాడు..
సోమవారం ఉదయం జలీల్ అనే 32 ఏళ్ల వ్యాపారి నటుడు రాఘవ లారెన్స్తో బీచ్కు చేరుకుంటున్న సమయంలో విద్యార్థులను పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జలీల్ గత మంగళవారం నిరసన ప్రదర్శన ప్రారంభించిన ఆందోళనకారుల మొదటి బ్యాచ్కు చెందినవాడు. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేయడంతో రెండు గంటల పాటు లారెన్స్ అక్కడికి చేరుకోలేకపోయాడు.

లారెన్స్ అక్కడికి వచ్చిన తర్వాత...
లారెన్స్ అక్కడికి చేరుకునే సరికి విద్యార్తులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి పంపించడం ప్రారంభించారు. అప్పటికే సగం మంది ఆందోళనకారులు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెల్లాచెదురయ్యారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ఆర్డినెన్స్ గురించి తాను వివరిస్తుండగా, కొన్ని గ్రూపులు పిసిఎను సవరించాలి, శాశ్వత చట్టం కావాలి అంటూ కొంత మంది నినాదాలు చేయడం ప్రారంభించారని లారెన్స్ మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే.

ఆ తర్వాతే ఇలా...
విప్లవ గ్రూపులకు చెందిన శక్తులు ఆదివారం రాత్రినాటికి వివేకానంద హౌస్ ప్రాంతంలోకి వచ్చి చేరాయి. వారు తీవ్ర భావజాలాలతో కూడిన నినాదాలు ఇస్తూ వెళ్లాయి. తమిళుల ఆత్మగౌరవం అనే స్థాయిని దాటి, తమిళ జాతీయవాదం గురించి, వేర్పాటు వాదం గురించి మాట్లాడుతూ వచ్చాయి.












Click it and Unblock the Notifications