కొవిడ్-19 వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్ - 10లక్షలు దాటిన రికవరీలు - ఏపీ, తెలంగాణలో అనూహ్యం..
అంతూ పొంతు లేకుండా సాగుతోన్న కరోనా విలయాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైరస్ సోకినవాళ్ల సంఖ్య సంఖ్య 1.7కోట్లకు, కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 6.7లక్షలకు పెరిగింది. ఇండియాలో కొత్త కేసులు రోజుకో రికార్డును అధిగమిస్తూ ఇన్ఫెక్షన్ కు గురైనవాళ్ల సంఖ్య 16లక్షలకు చేరువైంది. ఈ దశలో కొవిడ్- 19 వ్యాక్సిన్, రికవరీలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.

వ్యాక్సిన్ ప్రయోగాల్లో ముందడుగు
దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ ప్రయోగాలు, ప్రపంచ సినారియో తదితర అంశాలపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కరోనాపై గతంలో రోజువారీ బ్రీఫింగ్ ఇచ్చిన కేంద్రం.. కొన్నాళ్లుగా ఆ పక్రియను నిలిపేసింది. ముఖ్యమైన అంశాలు ఉన్నప్పుడే ఆరోగ్య శాఖ అధికారులు మీడియా ముందుకొస్తున్నారు. దేశీయంగా తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ల ప్రయోగాల్లో ముందడుగులు పడ్డాయని మంగళవారం నాటి ప్రకటనలో కేంద్రం తెలిపింది.

ఫేజ్ -1, ఫేజ్-2లో..
‘‘మన దేశంలో, మన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఇప్పటిదాకా రెండు వ్యాక్సిన్లు తయారయ్యాయి. ఇవి రెండిట్లో మొదటిది ఫేజ్-1, రెండోది ఫేజ్-2 దశల్లో ఉన్నాయి. తొలి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 8 చోట్ల 1150 మందిపై ప్రయోగించారు. రెండో వ్యాక్సిన్ను 5 చోట్ల 1000 మందిపై ప్రయోగించారు. ఇప్పటివరకు వచ్చినట్లే తాజా ట్రయల్స్ లోనూ ఫలితాలు మెరుగ్గా వస్తాయని ఆశిస్తున్నాం. ఇండియా కాకుండా, అమెరికా, రష్యా, చైనా చేపట్టిన కొవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఫేజ్-3 దశలో ఉన్నాయి'' అని కేంద్ర ఆరోగ్య శాక అధికారులు చెప్పారు.

కొత్త కేసుల్లో మళ్లీ రికార్డు..
కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 52,123 పాజిటివ్ కేసులు, 775 మరణాలు నమోదయ్యాయి. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి. గురువారం సాయంత్రం నాటికి మొత్తం కేసుల సంఖ్య 16 లక్షలకు చేరువకాగా, కొవిడ్ కాటుకు బలైపోయినవారి సంఖ్య 35వేల మార్కును దాటింది. బుధవారం నాటికి మొత్తం మొత్తం 1.82కోట్ల శాంపల్స్ ను టెస్టు చేశారు. కాగా, అన్ లాక్ 3.0లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ప్రకటించినప్పటికీ, వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ ప్రకటిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే,

రికవరీల్లోనూ భారత్ సూపర్..
దేశంలో కొత్త కేసులు వెల్లువలా నమోదవుతున్నప్పటికీ, రికవరీలు కూడా అంతకంటే మెరుగ్గా ఉండటం గొప్ప ఊరట కలిగించే అంశం. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్లో రికవరీ రేటు సంతృప్తికరంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన నాలుగు నెలల్లో మన రికవరీల రేటు గణనీయంగా పెరిగిందని అధికారులు చెప్పారు. కేసులు తక్కువగా ఉన్న ఏప్రిల్తో రికవరీ రేటు 7.85 శాతం ఉండగా, ప్రస్తుతం (జులై 29 నాటికి) రికవరీ రేటు 64.4 శాతానికి పెరిగిందని తెలిపారు. తద్వారా కొవిడ్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నవాళ్ల సంఖ్య 10 లక్షల మార్కు దాటిందన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రాల వారీగా రికవరీ రేటు వివరాలను కేంద్రం వెల్లడించింది.

మన దగ్గర మరణాలూ తక్కువే..
కరోనా మరణాల రేటు పరంగానూ ఇండియా మెరుగైన స్థానంలో ఉందని, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ డెత్ రేటు 4.0శాతంకాగా, మన దేశంలో మాత్రం అది కేవలం 2.21 శాతంగా ఉందని కేంద్రం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాలను పరిశీలిస్తే.. యూకేలో డెత్ రేటు రికార్డు స్థాయిలో 15.3 శాతంగా ఉందని, మెక్సికో 11.1 శాతం, ఇరాన్ 5.5 శాతం, బ్రెజిల్ 3.6, అమెరికా 3.5 శాతం, రష్యాలో డెత్ రేటు 1.6 శాతంగా ఉందని పేర్కొన్నారు.
Recommended Video

ఏపీలో మరణాలు.. తెలంగాణలో రికవరీలు..
ఒకప్పుడు భయానక స్థితిలో ఉన్న ఢిల్లీలో కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవడం మొదలైన తర్వాత చాలా మెరుగుపడింది. దేశంలోనే అత్యధిక రికవరీ రేటు 88 శాతంతో ఢిల్లీ ముందుందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో లదాక్ 80 శాతం, హర్యానా 78 శాతం, అస్సాం 76 శాతం, తమిళనాడు, గుజరాత్లలో 73 శాతం, రాజస్థాన్ 70 శాతం, మధ్యప్రదేశ్ 69 శాతం, గోవాలో 68 శాతంగా ఉందని చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, రికవరీల పరంగా తెలంగాణ (74 శాతం) ముందు వరుసలో ఉండగా, జాతీయ సగటు (2.21 శాతం) కంటే తక్కువ మరణాలతో ఆంధ్రప్రదేశ్(1.01శాతం) మెరుగైన స్థానంలో ఉండటం గమనార్హం. కొత్తగా 1811 కేసులతో తెలంగాణలో మొత్తం 60,717 కేసులు, 503 మరణాలు నమోదుకాగా, ఏపీలో 10,167 కొత్త కేసులతో మొత్తం 1.30లక్షల కేసులు, 1281 మరణాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications